కాల గమనాన్ని ఒడిసిపట్టిన కథలు
65-75 మధ్య కాలపు సాహితీప్రియులకు సుపరిచితమైన పేరు పరిమళా సోమేశ్వర్. యద్దనపూడి, ద్వివేదుల, మాదిరెడ్డి, చిట్టారెడ్డి, పోల్కంపల్లి వంటి రచయిత్రుల సమకాలీనురాలు. సాహిత్య లోకాన్ని రచయిత్రులు ఏలుతున్న కాలమది. అప్పటికే చలం, శ్రీపాద, రావిశాసి్త్ర, బుచ్చిబాబు, కొకు వంటి మహామహులు రచనలు చేసినప్పటికీ రచయిత్రులపై శరత సాహిత్య ప్రభావమే ఎక్కువగా ఉండడం గమనార్హం. అందుకు పరిమళా సోమేశ్వర్ కథలూ మినహాయింపు కావు. ఈ సంపుటిలోని 42 కథల్లో ఒకటీ అరా ఇతర ఇతివృత్తాలతో ఉన్నప్పటికీ ఎక్కువగా స్ర్తీల చుట్టే తిరిగాయి. వంటింటి కుందేలు దశను దాటి విద్య, ఉద్యోగం, పురుషుడితో సమాన హక్కులు కోరుకునే దిశగా రచనలు సాగించారు.
‘క్రోటను మొక్కలు’ కథలో పద్నాలుగేళ్ల వయసు తేడాలో ఉన్న అక్కాచెల్లెళ్ల మధ్యగల భావ వైరుధ్యాన్ని స్పష్టంగా చెప్పారు. కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుని పెళ్లి మాటెత్తని సీ్త్ర ఒకరైతే, ఆచార వ్యవహారాల కంటే తన సుఖమే ముఖ్యమనుకుని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయిన స్త్రీ మరొకరు. అప్పటి సీ్త్రలలో పొడచూపుతున్న భావ స్వేచ్ఛకు ఉదాహరణ ఈ కథ. ఏ పాపం ఎరుగని సుజాత జీవితంతో విధి ఆడిన ఆటను ఆర్ద్రంగా చెప్పి పాఠకులచేత ‘అయ్యో’ అనిపించేలా రాసిన కథ ‘తప్పెవరిది?’. ఆనాటి స్ర్తీ పురుషుల స్వభావాల పరిశీలనలో విస్తృతమైన ప్రజ్ఞ కనబరచడానికి కారణం రచయిత్రి కళాశాల అధ్యాపకురాలుగా పని చేయడం కావొచ్చు. ముఖ్యంగా 60 - 70 దశకాల మధ్యతరగతి జీవితాలు, కుటుంబ వ్యవస్థ, సమాజ మార్పు .. కళ్ళకు కట్టినట్టు రాశారు. అయితే, క్లుప్తత పాటించకపోవడం వల్ల కొన్ని కథలు సాగదీసినట్టు అనిపిస్తాయి.
- తహిరో
పరిమళా సోమేశ్వర్ కథలు
పేజీలు : 460, వెల : రూ. 280, ప్రతులకు : నవచేతన, విశాలాంధ్ర
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT
Ltd.
Designed & Developed by AndhraJyothy.