కుబుసం లాంటి తెల్లటిచీరలో బెడ్రూమ్‌ పక్కన నిలబడి ఆహ్వానించిందామె. ఆమె అందాలు అతడిని రా రమ్మని కవ్వించాయి. ఆమెను గట్టిగా వాటేసుకున్నాడతను. గాలికి అల్లల్లాడే తీగకు ఆధారం దొరికినట్టు అతన్ని గాఢంగా అల్లుకుపోయిందామె. వివశంగా అతడిని మీదకులాక్కుని బెడ్‌పైన ఒరిగిపోయిందామె. ఆ రాత్రి అందాలవిందారగించాడతను. ఇక ఆ తర్వాత ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. కానీ....

కడప టౌన్.ఆగస్టు 25.వన్‌టౌన్ పోలీ‍స్‌స్టేషన్‌లో రాత్రి మూడు గంటలవేళ అదేపనిగా ఫోన్ మోగుతోంది. డ్యూటీలో ఉన్న ఎస్.ఐ. చంద్రశేఖర్ ఫోన్ అందుకున్నాడు. అవతల్నించి చెప్పిందివిని అలర్టయ్యాడు. తెలుగుగంగ కాలనీలో రెండిళ్ళల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వెంటనే మిగతా పోలీ‍స్‌స్టేషన్‌లకు కూడా ఆ సమాచారం అందించాడు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను తీసుకుని జీపులో బయలు దేరాడు.అప్పుడప్పుడే తెలవారుతోంది. జనసంచారం మొదలైంది. దోపిడీ జరిగిన తెలుగుగంగ కాలనీ ప్రదేశానికి చేరుకున్నాడు ఎస్‌.ఐ. దోపిడీ ప్రదే‌శంలో దృశ్యాలు బీభత్సంగా ఉన్నాయి. ఒక ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడున్నాయి. హాలుమధ్యలో సజీవదహనమైన ఓ పురుషుడిశవం పడి ఉంది. పక్కన గదిలోంచి ఓ స్త్రీ కేకలు వినిపిస్తున్నాయి.

గది బయట గడియ వేసుంది.పోలీసులు వెళ్ళి తలుపు గడియ తియ్యగానే ఓ నడివయస్సు స్త్రీ, నాలుగేళ్ళపాప ఏడుస్తూ బయటికి వచ్చారు. హాల్లోని శవాన్ని చూస్తూనే ‘‘ఎంత పని జరిగింది రవీందర్‌...’’ అంటూ కెవ్వున అరిచి మూర్చపోయింది. ఆమె రవీందర్ భార్య పుష్పవల్లి. ఆమెను వెంటనే ఆ‍సుపత్రిలో చేర్పించాడు ఎస్‌.ఐ. దోపిడీ జరిగిన రెండో ఇల్లు రమణారెడ్డిది. అక్కడ సగం కాలిపోయిన స్త్రీ శవం ఉంది. ఆమె రమణారెడ్డి భార్య సుమతి.దోపిడీ జరిగినప్పుడు రమణారెడ్డి ఊళ్ళో లేడు. శవ పంచనామా చేస్తుండగా అక్కడికి ఒక ఆటో వచ్చింది. రమణారెడ్డి ఆటోలోంచి దిగాడు. అక్కడి వాతావరణం అతడిని కలవరపరిచింది. భార్య సజీవదహనమైన సంగతివిని షాక్‌ తిన్నాడు. భార్య శవం మీదపడి ఘొల్లుమని ఏడవసాగాడు.ఎస్.ఐ అతణ్ణి సముదాయించాడు. ‘‘నిన్న రాత్రి మీరు ఎక్కడికెళ్ళారు’’ అడిగాడు చంద్రశేఖర్‌.‘‘ఓ అర్జంటు పనిమీద రాత్రి రాజంపేట వెళ్ళాను సార్. నేనుంటే ఈ ఘోరం జరిగేదికాదు’’