జైపూర్ నగరం. క్రాంతిపుర రోడ్. సాయంత్రం ఆరు గంటలు. తెలుగువాడు వరప్రసాద్ ఇంట్లో విందు కార్యక్రమం. కుటుంబ సభ్యులే కాక నగరంలో ఉన్న కొందరు తెలుగువారు, స్థానికులు హాజరయ్యారు. కబుర్లతో అంతా సందడిగా ఉంది.‘‘డియర్ ఫ్రెండ్స్! మా ఆహ్వానాన్ని మన్నించి కుటుంబ సమేతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా అబ్బాయి వసంత ఏర్పాటుచేసిన కార్యక్రమం మాత్రమే కాదు మరో ముఖ్యమైన సందర్భం కూడా ఉంది. అది మీతో పంచుకోవాలని నా అభిలాష’’ అన్నాడు వరప్రసాద్ .‘‘విత ప్లెజర్ ప్రసాద్గారు. చెప్పండి..’’ అన్నారు కొందరు ఉత్సాహంగా.వరప్రసాద్ సాహితీప్రియుడు కూడా కావడం వల్ల విషయాన్నికథగా చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘మన నెల్లూరు పట్టణంలో అదొక బ్రహ్మచారి గది. అందులో గోడలమీద సినిమాతారల శృంగార చిత్రాలు, కండలు తిరిగిన హీరోల బొమ్మలు కనపడవు. పోనీ వివేకానందుడు, బుద్ధుడి ఫోటోలు ఉన్నాయా అంటే అవీ లేవు. యాష్ ట్రేలు, అటకమీద ఖాళీ సీసాలు లేవు. సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు అప్పటికి లేవు. గదిలో అడ్డంగా కట్టిన ఒక దండెం. దానిమీద ఎప్పుడూ ఒకటి రెండు బట్టలు వేలాడుతుంటాయి, ఆ గదిలోని వ్యక్తిలాగా.ఒక రేకు కుర్చీ, కొన్ని పుస్తకాలు మాత్రమే అక్కడున్నాయి.
బయట గోడమీద నీలం రంగు చాక్పీస్తో ‘రామకృష్ణ’ అనే అక్షరాలు దర్శనమిస్తాయి... అమ్మ పంపే మనియార్డర్ తెచ్చే పోస్ట్మ్యాన్ని ఆకర్షించటానికి. గదికి తాళం వెయ్యనవసరం లేదు. బయట గడియపెట్టి వెళుతుంటాడు.ఆరోజు తెల్లవారి చాలా సేపయ్యింది. తలుపుకొట్టిన చప్పుడు. రామకృష్ణ బద్ధకంగా లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా బుల్లెమ్మ. ఆరు పదుల వయసు. ఐదడుగులు మించని ఎత్తు. మూడొంతులు తెల్లబడిన ఒత్తైన జుట్టు. మోచేతుల దాకా తెల్లని జాకెట్టు. ఆకుపచ్చ రంగు నేత చీర. అర్ధరూపాయి పరిమాణంలో బొట్టు. మెడలో పసుపుతాడుతో పాటు మరో పూసల దండ. ఒకవిధమైన మందహాసంతో కూడిన చూపు. అందులో కనపడేది వేదాంతతత్వమో, నీ సంగతి నాకు తెలుసులే అనే నిర్లక్ష్యభావమో ఎవరికి కావలసినట్లు వాళ్ళు అన్వయించుకోవచ్చు. చేతిలో చిన్న గిన్నె.