కాండివిలిలో బయటపడ్డ అవశేషాల్నిబట్టి రాతియుగంలోనే ఈ ప్రాంతం జనావాసమని నిర్ధారణ అయింది. పశ్చిమ ముంబయిలోని కాండివిలి ఇప్పుడు అత్యంతాధునిక కట్టడాలున్న రద్దీ ప్రాంతం. రాతియుగంలో పుట్టాల్సిన ఓ ఐదుగురి ఉనికి మాత్రం ఇంకా అక్కడి నాగరికతను వెక్కిరిస్తోంది.
45 ఏళ్ల కుమోద్ ఫ్రెండ్తో కలిసి హోటల్కెళ్ళాడా రాత్రి. పిచ్చాపాటీ మాట్లాడుతూ డ్రింక్ చేశారిద్దరూ. కాసేపటి తర్వాత బయటికొచ్చారు. అక్కడ పాతిక ముప్ఫై ఏళ్ల లోపున్న ఐదుగురు యువకులు నిలబడి ఉన్నారు. వాళ్ళ పక్క నుంచి పోతున్నపుడు కుమోద్ చెయ్యి ఒకడికి తగిలింది.‘‘ఏయ్!’’ అని కొట్టబోయాడు వాడు.‘‘సారీ భాయ్’’ అన్నాడు కుమోద్ మత్తుగా.‘‘సారీ ఏంది బే, సారీ...?’’ మీదకు రాబోయాడు వాడు.కుమోద్ ఫ్రెండ్ ఆపుతూ తను కూడా సారీ చెప్పాడు.‘‘నీ కీపా బే, చెయ్యేశావ్!’ అని ఒక్కటి పీకాడు ఇంకొకడు కుమోద్ని.
వెంటనే మరో ఇద్దరు మొనదేలిన రాళ్ళెత్తుకుని కుమోద్ మీద దాడి చేశారు. తూలి బోర్లాపడ్డ కుమోద్ తల మీద రాళ్ళతో మోదారు. క్షణాల్లో అక్కడ్నించి పారిపోయారు.రక్తమోడుతున్న కుమోద్ని చూసి కంగారు పడింది అతడి భార్య. భయం భయంగా ఆమెకి ఏదో చెప్పి తక్షణం ఆటో కోసం పరుగెత్తాడు ఫ్రెండ్. ఆటో దొరక్క కంగారు పడుతూంటే పోలీస్ పెట్రోలింగ్ కారొచ్చింది. వాళ్ళు ఎక్కించుకుని హాస్పిటల్కి చేర్చారు. అప్పటికే ప్రాణాలతో లేడు కుమోద్.
మర్నాడు అంత్యక్రియలు జరిగాయి. భారంగా రోజులు గడుస్తున్నాయి కుమోద్ భార్యకి. కుమోద్ తాగిన మైకంలో కింద పడ్డ ఫలితంగా జరిగిన మరణమని పోలీసులు కేసు మూసేశారు. ఇరవై రోజుల తర్వాత, ముంబయి పోలీస్ కమిషనర్కి ఒక ఈమెయిల్ అందింది. అది చూసి వెంటనే క్రైమ్ బ్రాంచ్ని అలర్ట్ చేశాడు. సీనియర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ చిమాజీ ఆధవ్ ఆఘమేఘాల మీద రంగంలోకి దిగాడు.‘‘అలా పడిపోలేదాయన, వాళ్ళే నెట్టేశారు. రాళ్ళతో దాడి చేశారు. వాళ్ళల్లో ఒకడు పప్పీ అని తెలిసింది’’ అంది కుమోద్ భార్య ఇంటికొచ్చిన ఇన్స్పెక్టర్ చిమాజీతో.