రాజహంస-కలహంస తల్లీ కూతుళ్ళు. తల్లీకూతుళ్ళేగాని, కలహంస కన్నతల్లి కాదు రాజహంస, సవతితల్లి. ఇద్దరికీ వయసులోగాని, అందచందాల్లోగాని పెద్దగా తేడా లేదు. ఫలితంగా తెలిసిన వాళ్ళు, ఆ ఇద్దరినీ తల్లీకూతుళ్ళనుకుంటే, తెలియని వాళ్ళు అక్కాచెల్లెళ్ళనుకుంటారు.రాజహంస మహా అందగత్తె. ప్రపంచసుందరి. ఆ సుందరిని ఆమె ఎత్తు బంగారం చెల్లించి మరీ వివాహం చేసుకున్నాడు రాజు. ప్రపంచ సుందరిగా ఎప్పుడూ తానే ఉండాలి. మరొకరు ఉండరాదన్నది రాజహంస ఆశ. ఉంటే భరించలేదామె.ఆ భరించలేనితనంతో ఎంతకైనా తెగించేందుకు వెనుకాడదు. ఇంత వరకూరాజహంసను మించిన అందగత్తె లేదు. ఆ విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నదామె. ఇప్పుడు ఉన్నదేమోనని, ఆ సంగతి తెలుసుకునేందుకు, కలహం ససహా బయల్దేరింది.ఊరికి ఉత్తరాన, కొండల్లో కోన ఒకటి ఉంది. ఆ కోనలో చల్లని నీరుగల నుయ్యి ఒకటి ఉంది. ఆ నూతిలో పెద్ద తాబేలు ఉంది. ఆ తాబేలుకి, ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసు. ఏది అడి గినా ఇట్టే చెబుతుందది. ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. అబద్ధం చెప్పదు.

దాన్ని అడిగే తనని మించిన అందగత్తె లేదని సంతృప్తిగా ఉంది రాజహంస. ఇప్పుడు కూడా దానిని అడిగేందుకే కలహంససహా కోనకి బయల్దేరింది. నూతి దగ్గరకి చేరుకుంది. తీసుకువచ్చిన మంచిముత్యాలను దోసిళ్ళతో నూతిలో పోసింది. వాటిని అందుకునేందుకు పైకి తేలి వచ్చింది తాబేలు. అలా వచ్చిన తాబేలుకి చేతులెత్తి నమస్కరించింది రాజహంస. తర్వాత అడిగిందిలా.‘‘కూర్మరాజా! ప్రపంచసుందరిని నేనే కదూ?’’‘‘కాదు’’ అన్నది తాబేలు.‘‘మరెవరు?’’ తట్టుకోలేక, కసిగా అరిచింది రాజహంస.‘‘నీ సవతి కూతురు కలహంస.’’ అన్నది తాబేలు. ఆ మాటలు భరించలేకపోయింది రాజహంస. గుడ్లు ఉరుముతూ కలహంసను చూసింది. మీదపడి ఆమెను రక్కేసింది. జుత్తు పీకేసింది. అలంకరణంతా చెరిపేసి, ఆభరణాలన్నీ తీసేసింది.‘‘కోటకి పద చెబుతాను.’’ అన్నది. కలహంసను బరబరా ఈడ్చుకుని వచ్చింది. కోటలో బంధించిందామెను.రాత్రి ఏకాంతమందిరంలోనికి రాజు వస్తున్నాడని తెలిసి, అనారోగ్యాన్ని నటించసాగింది. అమ్మో అబ్బో నాయనో అంటూ గుండెలూ, గొంతూ, కడుపూ పట్టుకుని మెలికలు తిరగసాగింది. రాజు వచ్చి చూశాడామెను. బాధ్యతగా రాజవైద్యులను పిలిపించాడు.