హైదరాబాద్, నల్లకుంట: మహానటుడు, స్వర్గీయ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి సందర్భంగా అక్కినేని రచించిన అక్కినేని ఆలోచనలు పుస్తక అనువాద ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 23న నాంపల్లి ఎన్టీఆర్ ఆడిటోరియంలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతుందని రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంకే.రాము వెల్లడించారు. గురువారం హైదర్గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యఅతిథిగా తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ రోశయ్య హాజరవుతారని, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, కేంద్రీయ హిందీ భాషా సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కేవీ.కృష్ణకుమారి, ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ ఏఎ్స.నారాయణ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి ముందుగా అక్కినేని నటించిన చిత్రాల్లోని సినీగీతాలనుప్రముఖ గాయకుడు చంద్రతేజ ఆలపిస్తారని డా.ఎంకే.రాము తెలిపారు.