21వ శతాబ్ధ తెలంగాణ సాహిత్య కిరీటంలో కలికితురాయి ప్రముఖ గేయ రచయిత, కవి అందెశ్రీ. ఆయన కలం నుంచి జాలువారిన పాటలన్నీ సామాన్యుల గుండెల్లో పదిలమే. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అని రాసినా, ‘జయ జయహే తెలంగాణ’ అంటూ తెలుగునాట అక్షరాల జయకేతనమెగరేసినా అది అందెశ్రీకే సొంతం. అందుకే ఆయనను చాలామంది ప్రజలకవిగా పిలుచుకుంటారు. నరనరానా అక్షరాల పట్ల మమకారాన్ని నింపుకొన్న ఆయన శుక్రవారం హైదరాబాద్ బుక్ఫెయిర్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి‘తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఆంధ్రజ్యోతి: పుస్తకమహోత్సవ ప్రాంగణాన్ని చూస్తుంటే కవిగా మీకేమనిపిస్తోంది?
అందెశ్రీ: అక్షరాన్నే ఇరుముడి గా కట్టుకున్న బుక్ఫెయిర్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ అక్షర విత్తనా లు చల్లే నేల కాగితాన్ని తలపిస్తోన్న ఈ పుస్త క ప్రదర్శన కొన్ని లక్షలమందిని ఆకర్షిస్తోంది. పది రోజుల పాటూ అక్షర వనవిహారంలో అనేక మందికి విజ్ఞాన అనుభూతిని పంచుతున్న హైదరాబాద్ బుక్ఫెయి ర్ నిర్వాహకులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ ప్రాంగణంలో ఒక్క ప్రక్రియ మాత్రమే కాదు, భిన్నాభిన్న దృక్పథాల సాహి త్యం, విభిన్న ప్రాంతాలకు సంబంధించిన రచనలు పోగుపడున్నాయి. ఆధ్యాత్మికత రచనల నుంచి మొదలుపెడితే ఆధునిక విప్లవ, దళిత, బహుజనుల, స్త్రీ అస్తిత్వవాదాలు, జాతివిముక్త పోరాటాలు, విశ్వాంతరాల నేపథ్యాలను ఆవిష్కరించే పలు అరుదైన రచనల న్నీ కొలువుదీరున్నాయి. అందుకే పుస్తకమహోత్సవాన్ని అక్షరాల విశ్వవిద్యాలయం అంటా ను. ఇక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తీ విద్యార్థే.
ఆంధ్రజ్యోతి: మీ అభ్యున్నతిలో పుస్తకం పాత్ర?
అందెశ్రీ: నా జీవితంలో పుస్తకం ఒక మహోన్నత గురువు. అదే ఒక గురుకులం కూడా. నేను బడికెళ్లి చదువుకోక పోవచ్చు. కానీ, నా ఔన్నత్యానికి పుస్తకం ఎంతగా తోడ్పడిందో, అంతకు రెట్టింపుగా తెలంగాణ ఉద్యమశక్తులు అండగా నిలిచాయి. నేను డిగ్రీల కోసమో, ఊరేగింపుల కోసమో అక్షరాన్ని పట్టుకోలేదు. నా దేహంలో ఆడుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ఎంతగా ఇష్టపడతా నో కవిత్వాన్ని అంతే ఇష్టపడతాను. అక్షరం నా అమ్మను నిక్షిప్తం చేసుకొన్న లిపి. నేడు కొన్ని లక్షల భావాలకు నెలవైన కొన్ని వేల పుస్తకాలను చూస్తేనే కదా నేను కూడా ఒక పుస్తకం రూపొందించగలిగేది.
ఆంధ్రజ్యోతి: జ్ఞాన తెలంగాణ నిర్మాణం కోసం రచయితలు ఎలాంటి పాత్ర పోషించాలి.?
అందెశ్రీ: జ్ఞాన తెలంగాణ సిద్ధించాలంటే మొద ట తెలంగాణకు పట్టిన అజ్ఞానం, అహంకారం తొలగాలి. వ్యక్తి ఆరాధన నేపథ్యంలో సాగుతోన్న భజనపరమైన బానిసత్వం తొలిగినప్పుడే అక్షర తెలంగాణ సాకారమవుతుంది. మొదట తెలంగాణలో అక్షరం గులాంగిరీ చేయోద్దు. ఎవరి దగ్గరా చేయద్దు. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుకు అక్షరం నిగూఢంగా పనిచేసింది. గేయంగా, వచనంగా, కథగా, కథనరంగం తొక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరు దశాబ్దాల కల నెరవేరడంలో ‘అక్షరం’ సైనికచర్యగా నిలిచిం ది. రచయితలకూ నేను చెప్పదలచుకుంది ఒక్కటే. సాహిత్యంలో రెండే అంశాలు. అందులో ఒకటి అమ్మకం, రెండు నమ్మకం. బతుకుదెరువు కోసం మీరేమైనా చేసుకోండి. కానీ, రాబోయే కాలానికి కలాలను, గళాలలను అమ్మకానికే, ప్రతిదీ ఆడంబరాలకే పరిమి తం చేయద్దు. భజన అంటే కేవలం పాలకుల అడుగులకు మడుగులు ఒత్తడమే కాదు. తాము అనుకున్నదే నిజమనుకొనే భ్రమ ల్లో బతకడం వల్ల కూడా అక్షరం కుదించబడుతుంది. ఒక రచయిత హృదయం కోటి భావాలను కొనగోట మీటే మహోన్నత మానసవీణ అవ్వాలి.
ఆంధ్రజ్యోతి: మీ ప్రపంచ పర్యటనల ఉద్దేశం ఏమిటీ?
అందెశ్రీ: నేను కోటిలో ఒక్కడినే కానీ, కోటికొక్కడిని కాదు. నేను నూటిలో ఒక్కడినే కానీ నూటికొక్కడిని కాదు. అలా నేను ఒకేచోట కూర్చొని ఇరుకైపోతాననే భయంతో ఆరు ఖండాలను, ఏడు వింతలనూ చుట్టొచ్చాను. ఈ థరాతళం మీద పది మహానదుల పుట్టుక, ప్రయాణం, సంగమం గురించి అధ్యయనం చేశాను. అది కేవలం యాత్ర మాత్రమేకాదు, జీవనయాత్ర కూడా. నా యాత్రా విశేషాలను రెం డు పుస్తకాలుగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అంతేగాక నా యాత్రా విశేషాలను ముఖచిత్ర కథనాలుగా ఆదివా రం మేగజైన్లో ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే ప్రచురించింది. ఇది నన్ను నేను ఉద్ధరించుకోడానికి చేసిన యాత్ర. లోకాన్ని చదవడం కోసం చేసిన యాత్ర. త్వరలో నా ఆత్మకథను కూడా తీసుకురాబోతున్నాను.
ఆంధ్రజ్యోతి: మిమ్మల్ని ప్రభావితం చేసిన కొన్ని పుస్తకాల పేర్లు చెబుతారా ?
అందెశ్రీ: వందల, వేల పుస్తకాలకు తూకమైన ‘జీవనబృందావనం’ పుస్తకమంటే నాకు చాలా ఇష్టం. ‘ఏడుతరాలు’, ‘పరుసవేది’, ‘వివేకానందుని లేఖలు’, ‘చెగువేరా ఆత్మకథ’, ‘చంఘీజ్ఖాన్’, ‘బౌద్ధ సాహిత్యం’, ‘బౌద్ధ జాతక కథలు’, విశ్వనాథ ‘వెయ్యిపడగలు’, శార్వరి ‘సత్యసంహిత’, ‘చైనాపై అరుణతార’ తదితర రచనలతోపాటూ నాకు ‘స్టాలినిజం’ అంటే ప్రత్యేకమైన అభిమా నం. ఇవాల్టికీ రష్యా జనం గుండెల్లో నిలిచిన హీరో ‘స్టాలినే’. ఆయనే లేకపోతే తమ జాతి మిగిలేదేకాదని వాళ్లు భావిస్తున్నారు. 30రోజులు ఆ దేశాన్ని పర్యటించిన అనుభవాలతో నేను ఈ మాటలు చెబుతున్నాను.
ఆంధ్రజ్యోతి: భవిష్యత్లో పుస్తక పఠనం మాయమైపోయే అవకాశం ఉందంటారా ?
అందెశ్రీ: భవిష్యత్లో ఒక దానివల్ల పుస్తకం మాయమైతుందనే భయం కూడా ఉంది. అదే ఇంటర్నెట్. ఇంకా చెప్పాలంటే అదొక రంగుడబ్బా. అందులో అన్నీ నిక్షిప్తం చేశామని చెప్తున్నరుకానీ, నిజాయితీగా ముద్రించిన పుస్తకాన్ని చదివితే కలిగే అనుభూతి ఇంటర్నెట్ పుస్తకం చదవడంలో కలగదు. పుస్తకం చదవడం వల్ల ధారణ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సృజన పెరుగుతుంది. తద్వారా మనిషి సువిశాలమవుతాడు. అంతర్జాలం వల్ల ఒక సెకనులో ప్రపంచాన్ని దర్శించే లక్షణం ఉండొచ్చుగానీ, ఒక్క సెకనులో కోటి ఆలోచనల రసానుభూతిని ఆస్వాదించే రసానుభూతి లభ్యమవుతుందా. గూగుల్లో చదివే పుస్తకాలు మనిషి గుండెకు తాకుతాయని నేను అనుకోను.
ఆంధ్రజ్యోతి: యువత తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు?
అందెశ్రీ: మనస్సుకు నచ్చిన పుస్తకం చదవాలి. చేతికందిన పుస్తకం చదవాలి. లోకహితం కోసం పరితపించిన పది మం ది ప్రపంచ మహనీయుల జీవిత చరిత్రలను చదవాలి. బౌద్ధం, వివేకానందుడు, మార్క్స్, మావో, సోక్రటీస్, అరిస్టాటిల్, సైన్స్మీద వచ్చిన అత్యున్నత పుస్తకాలు తప్పక చదవాలి. దేశ సంస్కృతిని అవగతం చేసుకునేందుకు మహాభార త, భాగవత, రామాయణ కావ్యాలను చదవాలి.