13-10-2017: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.....అనే కవి వాక్కుకు అక్షర రూపం అమృతలత..ఆమె సాక్షాత్తూ చదువుల సరస్వతి మాత్రమే కాదు, రచయిత్రి, విద్యాదాత , కళాపిపాసి . 67ఏళ్ళ వయసులో కూడా సమాజానికి ఇంకా ఏదో చెయ్యాలనే తపనతో బహుముఖీన కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్ర్తీమూర్తి. ఈ కాలం పిల్లల చేష్టలు కొన్ని నాలాంటి అమ్మలు సహించలేకపోతున్నారనీ, తల్లిదండ్రులు వారిని సరిదిద్దాలనీ అంటున్న అమృతలత ఇంటర్వ్యూ .....
మాది నిజామాబాద్జిల్లా జక్రాన్పల్లి. కులవృత్తులకు నిలయం మా గ్రామం. నేను 1950లో పుట్టాను. నాన్నపేరు గడ్డం హన్మంతరెడ్డి. అమ్మ రాజవ్వ. నాన్న పోలీస్ పటేల్. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లెలు. నా నాలుగేళ్ళ వయసులోనే నా తల్లి మరణించింది. అమ్మ ప్రేమ తెలియదు. కనీసం మా అమ్మ ఫొటో కూడా లేకపోవడం మా దురదృష్టం.
మూడువేళ్ళు పోగొట్టుకున్నా
దేశ్ముఖ్ల గడీలో మా నివాసం. మా చదువు అక్కడే.కమ్మరి, కుమ్మరిసహా అనేకవృత్తులవారు ఈ గడీలో ఉండేవారు. ఆ వృత్తుల్లోని కళాత్మక నైపుణ్యాలను ఎంతో నిశితంగా దగ్గర్నుంచి గమనించేదాన్ని. నగలు, కుండల తయారీ చూసేదాన్ని. నాకూ చేయాలనిపించేది. ఒకసారి మా ఇల్లుదులిపినప్పుడు మా పూర్వీకులు వేటకు ఉపయోగించిన తూటా గొట్టం అటకమీంచి కిందపడింది. తెలియక నేను దాన్ని తీసుకెళ్ళి కమ్మరివారి మూసలో కరగబెట్టాను. అప్పుడు జరిగిన పేలుడుధాటికి నా ఎడమచేతి మూడువేళ్ళు తెగిపోయాయి. 1958లో ఈ ఘటన జరిగింది.
ఆత్మవిశ్వాసంనింపిన నాన్న
అక్కయ్యలు అత్తవారిళ్ళకు వెళ్ళాక నాన్నగారే నన్ను పెంచిపెద్దచేశారు. నాకు, చెల్లికి జడలు వేసేవారు. బామ్మ వండిపెట్టేది. ఆరోజుల్లో ఆడపిల్లలకు చదువులేదు. కానీ నాన్నగారు మగపిల్లలతో సమానంగా నన్ను పెంచారు. నాకు సైక్లింగ్ నేర్పి చదువుచెప్పి ప్రోత్సహించారు. మాలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపారు. అందుకే నేను ఇంట్లో అందరికంటే ఎక్కువ చదువుకున్నాను.
నాలుగు యూనివర్సిటీల్లో చదువు
నా కూతుర్ని డాక్టర్ని చేస్తా అనేవారు నాన్న. డాక్టర్కి వేళ్ళు ముఖ్యం. నా వేళ్ళుపోవడంతో నాన్న నిరాశ చెందారు. నాన్న కోరిక తీర్చేందుకు పిహెచ్డిచేసి మరోవిధంగా డాక్టర్నయ్యాను. పిహెచ్డి థీసిస్ నాన్నకే అంకితం చేశాను.నిజామాబాద్లో పియుసి, ఆంధ్రమహిళాసభలో 1973 బిఇడి చేశాను. హాఫేమిలియన్ స్కీమ్ (కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగ పథకం) లో భాగంగా ఇంటర్వ్యూలో ప్రథమస్థానంలో నిలిచి ఆర్మూర్లో ఉపాధ్యాయురాలుగా చేరాను. ఉద్యోగంచేస్తూ ఉన్నత చదువులు చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో బి.ఏ., వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎం.ఏ., ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఇడి (1989) చేశాను. నా 65వ యేట 25 ఏళ్ళ పిల్లలతో కూర్చుని ప్రవేశపరీక్షరాసి పిహెచ్డి సీటు సంపాదించాను. ఎంఇడిలో పిహెచ్డి చేశాను. Reading comprehension of tenthclass students in telugu subjectఅనే అంశంమీద 2015లో ధీసిస్ సబ్మిట్చేసి పద్మావతీ యూనివర్సిటీ పట్టాపొందాను.
మాతృభాష కి పట్టం
బాల్యం నుంచీ పుస్తకాలు, స్నేహితులే నా లోకం. నిఘంటువులే నా మిత్రులు. తెలుగుమీడియం చదువుకాబట్టి ఇంగ్లీషుతో టచ్ తక్కువ. దాంతో కాలేజీలో స్ర్టగులయ్యాను. పట్టుదలతో సాధనచేసి ఇంగ్లీషులో నైపుణ్యం సాధించాను. ఇంగ్లీషులో టీచింగ్ శిక్షణ ఇచ్చేస్థాయికి ఎదిగాను. అందుకే పిల్లల్ని తీర్చిదిద్దేందుకు ఇంగ్లీషుమీడియం స్కూలు పెట్టాలనే ఆలోచన వచ్చినాగానీ నా ప్రాధాన్యం ఎప్పుడూ తెలుగుకే. విద్యార్థుల్ని తెలుగులో నిష్ణాతులుగా తయారుచేసేందుకు యత్నిస్తాను. నా వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహిస్తాను.