కవి, పరిశోధకుడు , వ్యాస రచయిత, ప్రాచీన సాహిత్య అధ్యయనవేత్త సన్నిధానం నరసింహశర్మ. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం లో 42 ఏళ్ళు సేవలు చేసి ఎందరో ప్రముఖుల పరిశోధనలకు వాహకమయ్యారు . నేను అంబేద్కరిస్టును అంటారాయన . గ్రంథాలయాలు, భాషా సాహిత్యాలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రజలు నిలదీయాలంటున్న ఆయన ఇంటర్వ్యూ...
పశ్చిమగోదావరిజిల్లా కొవ్వూరు సమీపం కుమారదేవం గ్రామం మాది.1945డిసెంబరు ఏడవతేదీన పుట్టాను. ఏలూరు ఎస్టేటులోని లక్కవరం ఆస్థానకవి, శతాధిక గ్రంథకర్త కొత్తపల్లి సుందర్రామయ్యగారు మా తాతగారు. ఆ సాహిత్య వారసత్వమే నాకు అబ్బింది.మా నాన్నగారు సన్నిధానం ఇంటిపేరువారికి దత్తత వెళ్ళారు. అలా మా నాన్నగారిపేరు సన్నిధానం కృష్ణమూర్తి. అమ్మ సత్యవతి. నాన్నగారు సైన్యంలో హవల్దార్గా చేశారు. ఆంగ్లసాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. సుజనరంజని ముద్రణాలయంలో పనిచేశారు. నాకు తమ్ముడు, నలుగురు చెల్లెళ్ళు, ఒక అక్కయ్య. ఆర్థిక పరిస్థితులవల్ల పధ్నాలుగోయేట రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయంలో 20రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరాను.బి.ఏ సైకాలజీ, సోషియాలజీ చదివాను.
లక్ష గ్రంథాల నిలయం గౌతమి గ్రంథాలయం
జానపద సాహిత్య ఉద్ధారకుడు నేదునూరి గంగాధరంగారు 1962లో నాకు గౌతమి గ్రంథాలయంలో ఉద్యోగం వేయించారు. ఒకవైపు విజ్ఞానం పంచుతూ, మరోవైపు సాహిత్య, సాంస్కృతిక, నృత్య సాంఘిక కార్యక్రమాలకు నిలయమైన గౌతమీ గ్రంథాలయంతో నా జీవితం మమేకమైపోయింది. గ్రంథాలయ ప్రచార కార్యదర్శిగా, పాలకవర్గ సభ్యునిగా, కార్యదర్శిగా 2004 వరకు 45ఏళ్ళు అక్కడే పనిచేశాను. జీత సంపదకంటే, జ్ఞాన సంపదకే ప్రాధాన్యమిచ్చి నిరంతరం అక్కడే ఉండేవాణ్ణి. ఉపనిషత్తులు మొదలు వెయ్యేళ్ళ ఆంధ్రసాహిత్యంలోని వందలాది గ్రంథాలు చదివాను. ఎందరో ప్రముఖుల పరిశోధనలకు, ఉద్ర్గంధాల రచనలకు సహకరించి, మన్ననలు పొందాను.‘‘నాకు పిహెచ్డి డాక్టరేట్ రావడానికి సహకరించింది సన్నిధానం నరసింహశర్మే’’ అని వేదికపై సగర్వంగా ప్రకటించారు సినారె.
బంగోరె, ఆరుద్ర, చలసాని ప్రసాదరావు, కొత్తపల్లి వీరభద్రరావు, జయధీర్ తిరుమలరావు లాంటి ఎందరో పరిశోధకులు ఆనాడు గౌతమీ గ్రంథాలయానికి వచ్చినప్పుడు మా ఇంట్లోనే విస్తరి వేసేవారు.కమ్యూనిస్టులతోనే నా స్నేహం. సమసమాజం కోరుకునేవాణ్ణి. నేను అంబేద్కరిస్టును. అందుకే నా రచనలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. ఆనాటి గౌతమి గ్రంథాలయం కమ్యూనిస్టులకు నెలవు. పుచ్చలపల్లి సుందరయ్యగారు రాత్రిపూట అక్కడే బల్లమీద నిద్రపోయేవారు.1898లో నాళం కృష్ణారావుగారు స్థాపించిన గౌతమి గ్రంథాలయాన్ని 1979ఫిబ్రవరి 19న ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏడు ప్రాంతీయ గ్రంథాలయాలలో ఒకటిగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అక్కడ లక్షకుపైగా గ్రంథాలున్నాయి.
ఇందులోని కొన్ని పుస్తకాలు చదువుతుంటే రక్తచలనం కలిగేది. ఉదాహరణకు ‘‘శుద్ధాంద్ర నిరోష్ట్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షరీ శాకుంతలము’’ అనే పేరు గల పుస్తకం ఉండేది. అదేవిధంగా, ‘‘సంయుక్తాక్షర ప్రాసదుర్ఘటవైచిత్రకందసూర్య శతకము’’ అనే పుస్తకం ఉండేది. ఇవి ఆనాటి పుస్తకాల పేర్లు. వాటిని తీసిపారేయడానికి వీల్లేదు‘సినిమా థియేటర్లో ఉంటే బ్లాక్ టిక్కెట్లు ఎలా అమ్మాలో తెలుస్తుంది, ఒక గ్రంథాలయంలో ఉంటే జ్ఞాన విషయాలు, సాహిత్య చరిత్ర సమాజం, మనుషులు తెలుస్తారు. అదే విధంగా నేను గౌతమీ గ్రంథాలయంలో పనిచేయడంవల్ల మహానుభావుల పరిచయభాగ్యం లభించింది. గొప్ప గురువులు నాకు లభించారు. రాజమండ్రిపై పాటలు రాసింది ఆరుద్ర, నేను మాత్రమే. అక్కడే ఎంతో మంది పరిశోధకుల్ని ఇంటర్వ్యూలు చేసేవాణ్ణి.