చిత్రకారులు రంగులతో సమస్యను చిత్రీకరిస్తారు. సమాజంలోని భిన్న పార్శ్యాలను కుంచెతో కళ్లముందు ఉంచుతారు. అటువంటి గొప్ప కళాకారుడు చౌధురి సత్యనారాయణ పట్నాయక్. 92 ఏళ్ల వయస్సులోనూ ఆయన కుంచె రంగులీనుతోంది. ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన అనుభవాలను పంచుకున్నారు.
మామూలుగా కరణీకం చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న నాలో ఓ కళాకారుడు ఉన్నాడన్న సంగతి నేనే గుర్తించాను. అప్పటికింకా నేను కుర్రవాడినే.. ఓసారి శ్రీకాకుళం పట్టణంలోని నాగేశ్వర్ స్టూడియోకు వెళ్లాను. అక్కడున్న చిత్రాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాల గురించి స్టూడియో యజమాని కూర్మారావును పదేపదే అడుగుతుండేవాడిని. నా ఉత్సాహాన్ని గుర్తించి ఆయన బొమ్మలు గీయడంలో శిక్షణ ఇచ్చారు. అంతేకాదు నాకు ఇందులో భవిష్యత్తు ఉందని గుర్తించి.. మా నాన్నగారికి కూడా విషయాన్ని చేరవేశారు. నాన్న కూడా ఊ..! అనడంతో కరణీకం వదలి కుంచె చేతపట్టాను.
నేరుగా రెండో సంవత్సరంలోకి..
శ్రీకాకుళం జిల్లా ఉర్లాం రైల్వేస్టేషన్ సమీపంలోని బాడాం గ్రామం మాది. ఫస్ట్ఫారం వరకు నరసన్నపేట హైస్కూల్లో చదివాను. అనంతరం నాన్న అభీష్టం మేరకు ఏడేళ్ల పాటు కరణీకం చేశాను. అప్పటికి నా వయసు 18 ఏళ్లు. ఏడు రూపాయల జీతం. ఆరి్స్టగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాక.. ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాను. మద్రాసు వెళ్లి ఫైన్ ఆర్ట్స్లో చేరాను. అప్పటికి మన దేశంలో మూడు యూనివర్సిటీల్లో మాత్రమే ఈ కోర్సు ఉండేది. కాలపరిమితి ఆరేళ్లు. నా ప్రతిభను గుర్తించిన వర్సిటీ ప్రతినిధులు నన్ను నేరుగా రెండో సంవత్సరంలోకి అనుమతింరు. 1955లో డిగ్రీ పూర్తయింది. అదే ఏడాది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠ్లో డిప్లమోతో పాటు ఫ్రెస్కో మ్యూరల్ పెయింటింగ్ టెక్నిక్స్ కోర్సు కూడా చేశాను. న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఫ్రీహ్యాండ్ సర్టిఫికెట్, అవుట్లైన్ మోడల్ డ్రాయింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాను. అక్కడే బ్రాంజ్ స్కల్ప్చర్లో రీసెర్చి ఫెలోషిప్ పొందాను.
దేశవ్యాప్తంగా ప్రదర్శనలు
1962లో గుంటూరు మహిళా కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. 1983 వరకు అక్కడే పనిచేశాను. అనంతరం విశాఖ వచ్చి స్థిరపడ్డాను. ఇక్కడి ఎంవీపీ కాలనీలో 2009లో నా చిత్రాలతో ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య దీన్ని ప్రారంభించారు. ఇందులో మొత్తం 500 వరకు పెయింటింగ్స్, 800 వరకు డ్రాయింగ్స్, 80కి పైగా శిల్పాలు ఉన్నాయి. ఇందులో మా అబ్బాయి రవిశంకర్, కోడలు సంధ్య గీసిన చిత్రాలు కూడా ఉన్నాయి. నా చిత్రాలతో న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో అనేక ప్రదర్శనలు నిర్వహించాను. అంతర్జాతీయ ఈవెంట్లలోనూ నా చిత్రాలు కొలువుదీరాయి. తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ ఉపాధ్యక్షుడిగా, భారత శిల్పుల ఫోరం సంయుక్త కార్యదర్శిగా, ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో చిత్రకళకు సేవలందించాను. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో నిర్వహించిన ప్రపంచ రెండో తెలుగు మహాసభలో, అమెరికాలో నిర్వహించిన నార్త్ అమెరికా తెలుగు కాన్ఫరెన్స్లో నేను చేసిన ప్రసంగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాకొచ్చిన అవార్డులు నా కళకు లభించిన గుర్తింపుగా భావిస్తాను. భారత ప్రభుత్వం ఇచ్చిన కళారత్న అవార్డు, వయోశ్రేష్ట అవార్డులు ఎంతో సంతృప్తినిచ్చాయి. బాధ్యతను మరింత పెంచాయి.
అవకాశాలు బోలెడు..
ఏయూలో ఫైన్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటుకు తొలుత ప్రతిపాదించింది నేనే. దాని ఏర్పాటుకు ఎంతో కృషి చేశాను. ఫైన్ఆర్ట్స్ రంగం ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోంది. మంచి కళాకారుడు ఉద్యోగం కోసం ఎదురుచూడాల్సిన రోజులు పోయాయి. కోట్ల రూపాయల విలువ చేసే పెయింటింగ్లు కూడా ఉంటున్నాయి. ఉపాధి కోరుకున్న వారికి ఈ రంగంలో అవకాశాలకు కొదవ లేదు.
పైసా తీసుకోను..
ప్రవృత్తినే వృత్తిగా చేసుకుని ఏడు దశాబ్దాలు దాటిపోయింది. పెన్సిల్ అయినా, పెన్ను అయినా.. కుంచె అయినా చేతపడితే తొణుకు బెణుకు లేకుండా చిత్రాన్ని ఆవిష్కరించగలను. ఈ వయస్సులో కళాకారులకు శిక్షణ అయితే ఇవ్వలేను గానీ.. సలహాలు.. సూచనలు అందిస్తాను. నా గ్యాలరీలో ఎవరు ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవాలన్నా పైసా తీసుకోను. వాళ్లను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాను. బొమ్మ గీయని రోజు ఏదైనా వచ్చిందంటే అదే ఆఖరి రోజవుతుందేమో..!!
ఈ వయస్సులోనూ ఎవరి సాయం లేకుండానే నా పనులన్నీ చేసుకుంటాను. ఈ మధ్యనే స్టాండు కర్ర సాయం అవసరం పడుతోంది. ఓపిక కాస్త తగ్గింది. ఏ సమస్యపైనా ఎక్కువగా ఆలోచించను. కాస్తా మతిమరుపు దరిచేరింది. ఎప్పటికప్పుడు చేదు జ్ఞాపకాలను వదిలేసి కొత్తరోజును ప్రారంభిస్తాను.
నిద్ర లేచాక అరగంట కూడా ఖాళీగా కూర్చోబుద్ధి కాదు. చిత్తు కాగితం ఉన్నా.. ఏదో బొమ్మ గీస్తుంటా. పేపర్ క్రమం తప్పకుండా ఎలా చదువుతానో.. బొమ్మలు గీయడం కూడా అంతే. ఒక్కమాటలో చెప్పాలంటే బొమ్మ గీయని రోజు నా డైరీలోనే లేదు.
వాసు, విశాఖపట్నం, ఫొటోలు: విజయ్