ఘటోత్కచుని మృతి
కర్ణుని విజృంభణతో తమ సేనలు పలాయనం చిత్తగించడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ధర్మరాజు. అతనితో అర్జునుని డీ కొమ్మని ఆదేశించాడు. అన్న మాట కాదనక కర్ణుని డీ కొనేందుకు అర్జునుడు సిద్ధమయ్యాడు. రథాన్ని ముందుకు పోనిమ్మని కృష్ణునితో చెప్పాడు. కృష్ణుడు రథాన్ని ముందుకు పోనివ్వక అర్జునునితో ఇలా అన్నాడు.‘‘రాత్రివేళ రాక్షస వీరుల బలదర్పాలు ఎక్కువవుతాయి. వారిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇదే అదను. కర్ణుని నీవు కాదు, ఘటోత్కచుడు ఎదుర్కొంటాడు. అతను ఎదుర్కొంటేనే బాగుంటుంది. కర్ణుని అంతు చూడగలడతను. మనం మరో చోట యుద్ధం చేద్దాం’’అర్జునుడు ఆలోచనలో పడ్డాడు.‘‘ఘటోత్కచుని దగ్గర అనేక మాయమయ దివ్యాస్త్రాలున్నాయి. అతనిదే విజయం. నీకు ఎలాంటి అనుమానం అక్కరలేదు’’ అన్నాడు మళ్ళీ కృష్ణుడు.‘‘సరే బావా! నీ ఇష్టం’’అర్జునుని అంగీకారంతో ఘటోత్కచుని తన సన్నిధికి రప్పించాడు కృష్ణుడు.‘‘చెప్పవయ్యా! నల్లనయ్యా! నన్నెందుకు పిలిపించావు’’ అడిగాడు ఘటోత్కచుడు.‘‘ఎందుకంటే...చూశావుగా కర్ణుని వీరవిహారం. అతని ధాటికి మన సేనలు వెన్నిచ్చి పారిపోతున్నాయి. నీవు కర్ణుని నిలువరించాలి. ఆ వీరుడు అడుగు కూడా ముందుకు కదపకూడదు. రాత్రివేళ మీ జాతి బలం రెట్టింపు అవుతుంది. అది నీకు అనుకూలం. వెళ్ళు! కర్ణుని అంతు చూసి తండ్రులకు తగ్గ తనయుడివని పేరు తెచ్చుకో’’ ప్రోత్సహించాడు కృష్ణుడు.‘‘అవును ఘటోత్కచ! నీవు మా పేరు నిలబెట్టాలి’’ అన్నాడు అర్జునుడు.
ఆ మాటలకి ఆనందంగా చేతులు జోడించాడు ఘటోత్కచుడు.‘‘చూస్కోండి చిన్నాన్న! కర్ణుణ్ణి కసబిస నమిలేస్తాను’’ అన్నాడు ఘటోత్కచుడు. అంతే! మరుక్షణంలో అక్కడలేడతను. చూస్తే భీకర సింహనాదాలతో కర్ణునిపై విజృంభిస్తూ అక్కడెక్కడో కనిపించాడు. కర్ణుని డీ కొంటున్న ఘటోత్కచుని జటాసురుని కుమారుడు అలంబుసుడు ఎదుర్కొన్నాడు. ఒకరిపై ఒకరు ఎన్ని బాణాలను ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో ఇద్దరూ రథాలపై నుంచి కిందికి దిగి వివిధ భీకర రూపాలతో యుద్ధం చేయసాగారు. కాస్సేపటికి మల్లయుద్ధానికి దిగారిద్దరూ. ఘటోత్కచునికి పట్టు దొరికింది. అలంబుసుని అదిమిపట్టాడు. నేల మీదికి ఈడ్చి కొట్టాడు. తర్వాత అతని గుండెల మీద కాలితో బలంగా తన్ని, పిడికిళ్ళతో గుద్ది, తలని శరీరం నుండి గెల నుండి కొబ్బరికాయను లాగినట్టుగా లాగి వేరు చేశాడు. ఆ ఆనందంలో సింహనాదం చేశాడు. ఆ నాదానికి భూనభోంతరాళం గజగజ వణికింది. చేతిలో అలంబుసుని శిరస్సుంచుకుని దుర్యోధనుని రథాన్ని సమీపించాడు ఘటోత్కచుడు. దుర్యోధనునికి శిరస్సు ఎత్తి చూపించాడు. ఇలా అన్నాడు.‘‘చూశావా దుర్యోధనా! నీ అలంబుసుడు ఏమయ్యాడో! ఇలాగే నీ మిత్రుడు కర్ణుని కూడా చేస్తాను. కర్ణుని శిరస్సు మా తండ్రులకు కానక చేస్తాను’’‘‘ఎవడ్రా నువ్వు’’ కోపగించుకున్నాడు దుర్యోధనుడు.
‘‘ఎవణ్ణా? నా పేరు ఘటోత్కచుడు. నేను భీమసేనుని కుమారుణ్ణి. చాలా? వివరాలు ఇంకా కావాలా’’ అని పగలబడి నవ్వాడు. చేతిలోని శిరస్సును దుర్యోధనుని రథం మీదికి బంతి విసిరినట్టుగా విసిరి అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. కర్ణుని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుని బాణాలతో కర్ణుని రథం కనిపించకుండాపోతోంది. అంతలా శరపరంపర కొనసాగిస్తున్నాడతను. కర్ణుడు అభిమంత్రించి దివ్యాస్త్రాన్నొకటి ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. దాన్ని ఇట్టే నేల కూల్చాడు ఘటోత్కచుడు. తర్వాత తన మాయా ప్రభావంతో వేలాది మంది రాక్షసులను సృష్టించి వారిని యుద్ధోన్ముఖుల్ని చేశాడు. వారంతా పెద్ద పెద్ద కత్తులతో, గదలతో, త్రిశూలాలతో ప్రత్యర్థుల్ని ఎదుర్కొనసాగారు. కొండరాళ్ళను కురిపిస్తూ కౌరవసేనను భయకంపితుల్ని చేశారు. కర్ణుడొక అపూర్వ దివ్యాస్త్రాన్ని ప్రయోగించి ఘటోత్కచుని సేనను మటుమాయం చేశాడు. కోపోద్రిక్తుడయ్యాడు ఘటోత్కచుడు. చక్రాయుధాన్ని ప్రయోగించాడు. కర్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. గదని ప్రయోగించాడు ఘటోత్కచుడు. కర్ణుడు దాన్ని నేల కూల్చాడు. ఇలా కాదనుకున్నాడు ఘటోత్కచుడు. పెద్దగా కేకలు వేస్తూ ఆకాశానికి చేరుకున్నాడు. అక్కణ్ణుంచి పెద్ద పెద్ద రాళ్ళు, చెట్లు కర్ణుని రథం మీద గుప్పించాడు. వాటిని కూడా కర్ణుడు దీటుగా ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు మాయారథాన్ని అధిరోహించి కర్ణునికి కనిపించకుండా అతని మీద బాణాలు ప్రయోగించసాగాడు. కర్ణుడు ఆ మాయను ఛేదించాడు. ఘటోత్కచుని రథాన్ని ముక్కలు చేశాడు. సారథిని, రథాశ్వాలను నేల కూల్చాడు. ఇదే అదనుగా బకాసురుని తమ్ముడు అలాయుధుడు రణాంగణంలోకి ప్రవే శించాడు. దుర్యోధనుని ఆనతి మేరకు అతను ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్యా కనీ విని ఎరుగని రీతిలో యుద్ధం ప్రారంభమయింది. కొడుక్కి సాయంగా వచ్చాడు భీముడు. తండ్రీ కొడుకులిద్దరూ అలాయుధుణ్ణి ఎదుర్కొనసాగారు. అలాయుధుని బాణాలకు భీముని విల్లు విరిగిపోయింది. సారథి, గుర్రాలు ప్రాణాలు కోల్పోయాయి. భీముడు గదనందుకున్నాడు. అలాయుధుడు కూడా గదనందుకున్నాడు. ఇద్దరూ గదాయుద్ధం చేయసాగారు. ఇద్దరి గదలూ విరిగిపోయాయి. రథ చక్రాలందుకున్నారిద్దరూ. అవీ ముక్కలయ్యాయి. ఏనుగు దంతాలు తీసుకుని ఒకరిపై ఒకరు విజృంభించసాగారు. దాన్ని అల్లంత దూరం నుండి గమనించిన కృష్ణుడు, ఘటోత్కచుని చేరబిలిచి ఇలా చెప్పాడు.