16-12-2017 నరసాపురం: కళాతపస్వి, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ బాపు పురస్కారం అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం జరిగిన బాపు జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే మాధవనాయుడు విశ్వనాథ్‌ను సన్మానించి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ బాపు పేరుతో పురస్కారం అందుకోవడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తానని చెప్పారు.బాపు దగ్గర శిష్యరికం చేయాలనుకున్నా ఆ కల నేరవేరలేదని.. చివరికి ఆయన పేరిట నెలకొల్పిన పురస్కారం అందుకునే అవకాశం లభించిందని దీనిని ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి పితాని.. తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు విశ్వనాథ్‌ను అహ్వానించకపోవడంపై అవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలు వేరైనా తెలుగుమాట్లాడే వారంతా ఒక్కటన్న విషయం ప్రతి తెలుగువారు గుర్తించాలన్నారు.