బర్కత్‌పుర, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు, ఉద్యోగ క్రాంతి మాజీ ప్రధాన సంపాదకుడు వి.జయరాముడు రచించిన ‘చైతన్య రథచక్రాలు’ వ్యాసాల సంకలనం ఆవిష్కరణ సోమవారం రాత్రి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఉద్యోగ క్రాంతి తెలంగాణ సంపాదకుడు కె.జె.రామారావు అతిథిగా సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయరాముడు అనేక పోరాటాల్లో పాల్గొని అనేక వ్యాసాలను రాశాడని, ఉద్యోగక్రాంతిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ సభకు ఉద్యోగ క్రాంతి ఏపీ ఎడిషన్‌ ఎడిటర్‌ ఎ.అప్పారావు అధ్యక్షత వహించగా ఏపీటీఎఫ్‌ మాజీ అధ్యక్షులు ఎ.నర్సింహారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధి ఎం.రాఘవాచారి, పుస్తక రచయిత వి.జయరాముడు పాల్గొన్నారు.