హైదరాబాద్: ‘‘తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే ‘శంకరాభరణం’కి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చు. తెలుగు పరిశ్రమకు మైలురాయిలాంటి సినిమా అది. విశ్వనాథ్‌గారితో సినిమాలు చేశాను. నాకు క్లాసు, మాస్‌ ఇమేజ్‌ తీసుకొచ్చింది ఆయన సినిమాలే’’ అని చిరంజీవి అన్నారు. శనివారం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌, గాయకుడు ఎస్‌.పి.బాలును ఘనంగా సత్కరించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో, బాలు గానంలో ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. వాళ్లని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి సన్మానాలు వారికి కొత్తేమీ కాదు. ఇవన్నీ వాళ్లకి నూలుపోగుతో సమానం’’ అని అన్నారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ ‘‘అవార్డు వచ్చిందని నేనీ సన్మానానికి రాలేదు. సాధారణమైన వ్యక్తిగా వచ్చా. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు నాకు ఇప్పుడు వచ్చింది. రేపు ఇంకొకరికి వస్తుంది. ఎప్పటికీ నేను కాశీనాథుని విశ్వనాథ్‌నే’’ అని అన్నారు. ‘‘తెలుగు సినిమాతో 51 ఏళ్ల అనుబంధం నాది. ఇంతకాలం నన్ను భరించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నయ్య విశ్వనాథ్‌గారి పక్కన కూర్కొని సన్మానం అందుకోవడం గర్వంగా ఉంది’’ అని ఎస్‌.పి. బాలు అన్నారు. వెంకటేశ్‌, కె.ఎస్.రామారావు, కైకాల సత్యనారాయణ, సుహాసిని, భానుప్రియ, తులసి, రోజారమణి, సి.కల్యాణ్‌, సతీశ్‌ వేగేశ్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.