చిక్కడపల్లి, జూలై18(ఆంధ్రజ్యోతి): సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారిని ప్రోత్సహించాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. స్వరమాధురి ఆధ్వర్యంలో మూడు రోజుల బంగారు తెలంగాణ బోనాల వేడుక గురువారం త్యాగరాయగానసభలో ఘనంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల కళాకారులు పలు కళా ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్న వకుళాభరణం కృష్ణమోహనరావు బాల కళాకారులను, గాయనీగాయులను సన్మానించారు. తెలంగాణ కళారూపాల ప్రదర్శనలు నిర్వహించడం ఎంతైనా ముదావహం అన్నారు. తెలంగాణాలో అద్భుత కళాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించాలన్నారు. కొత్త కృష్ణవేణి, కళా జనార్దనమూర్తి, చంద్రజ్యోతి, శారద, శశిబాల తదితరులు పాల్గొన్నారు.