తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య
చిక్కడపల్లి, హైదరాబాద్, జనవరి17(ఆంధ్రజ్యోతి): సమాజాన్ని మంచిమార్గంలో నడిపించే రచనలు ఆహ్వానించదగ్గవని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గానసభలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్గా నియమితులైన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్కు సన్మానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డా. రోశయ్య మాట్లాడుతూ రచనలు చేయడమే కాకుండా మంచిగా రచనలు చేసేవారిని అభినందించే మనస్తత్వం కలిగిన ఉత్తముడు ఇనాక్ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఇరురాష్ట్రాల్లో సాహిత్యాభివృద్ధి చేస్తూనే ఆ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఇనాక్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా తాను ఇరువురం కలిసి సంస్కృతి, భాషాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణాలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తాము ఆ సభలకు విచ్చేస్తామన్నారు. సాహితీవేత్త నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణాకు సంబంధించిన కాళోజీ నారాయణరావు, పాల్కురికి సోమనాథుడు వంటి మహనీయుల చరిత్రలు చేర్చాలని ఇందుకోసం ఇనాక్ కృషి చేయాలని కోరారు.ప్రొ. ఇనాక్ మాట్లాడుతూ త్యాగరాయగాసభ కళలకు, సాహిత్యానికి అందిస్తున్న సహకారం మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన పురస్కారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ అధిపతి ఆచార్య సూర్య ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.