చెన్నై, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది గొల్లపూడి శ్రీనివాస్‌ అవార్డుకు ‘ఎ డెత్‌ ఇన్‌ ది గుంజ్‌’ పేరుతో ఆంగ్ల, బెంగాలీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు కొంకణాసేన్‌ ఎంపికైనట్లు.. గొల్లపూడి శ్రీనివాస్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నేతృత్వంలోని జ్యూరీ వివిధ భాషల్లో 2017లో విడుదలైన 23 నూతన దర్శకుల చిత్రాలను పరిశీలించి.. కొంకణాసేన్‌ను ఎంపిక చేసింది. శ్రీనివాస్‌ జయంతిని పురస్కరించుకుని మార్చిలో అవార్డును ప్రకటించి, వర్ధంతి రోజైన ఆగస్టు 12వ తేదీన ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పురస్కారం కింద రూ.1.50 లక్షల నగదు, జ్ఞాపికను బహూకరిస్తారు. గొల్లపూడి శ్రీనివాస్‌ పేరిట ఏటా ఉత్తమ నూతన దర్శకులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.