వరంగల్‌ కల్చరల్‌, నవంబరు 19: ఆంధ్రజ్యోతి దినపత్రికకు అనుబంధంగా ప్రచురితమవుతున్న నవ్య వారపత్రిక సంపాదకుడు ఎ.ఎన్‌. జగన్నాథశర్మకు రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కేయూ ఆచార్యులు కె.పురుషోత్తం సోమవారం ఇక్కడ వెల్లడించారు. ప్రముఖ కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి పేరిట ఏర్పాటు చేసిన ఈ తొలి సాహిత్య పురస్కారాన్ని ఈ నెల 25న హన్మకొండలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తామన్నారు. పురస్కారం కింద రూ. 15 వేల నగదు, దుశ్శాలువా, జ్ఞాపికతో జగన్నాథశర్మను సత్కరిస్తామన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బన్నా అయిలయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేయూ ఉప కులపతి ఆర్‌.సాయన్న ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డును బహూకరిస్తారు. ప్రముఖ కథకులు పెద్దింటి అశోక్‌కుమార్‌, రామా చంద్రమౌళి, అంపశయ్య నవీన్‌ తదితర ప్రముఖులు పాల్గొంటారు.