రవీంద్రభారతి/హైదరాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణకు 2019 సంవత్సరానికిగానూ ‘జస్టిస్‌ ఆవుల సాంబశివరావు’ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య పుంజాల అలేఖ్య శుక్రవారం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి లోకాయుక్త జస్టిస్‌ ఆవుల సాంబశివరావు పేరిట ఏటా మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ద్వారా వర్సిటీ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ నెల 30న తెలుగు వర్సిటీలో జరిగే కార్యక్రమంలో అల్లం నారాయణకు పురస్కారం కింద ప్రశంసాపత్రంతో పాటు రూ.25 వేల నగదు అందించి సత్కరిస్తారు.