గొల్లపూడి మారుతీరావుకు సినీ రత్న అవార్డు

అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ప్రకటన

డాలస్‌, టెక్సాస్‌, సెప్టెంబరు 18: దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత.. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ‘జీవనసాఫల్య పురస్కారం’ అందజేయనున్నట్టు ‘అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ ప్రకటించింది. నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావుకు అమెరికాలో ఉన్న సన్నిహితులు 2014లో ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఆ మహానటుడి కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం, దూరదృష్టి యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఏటా అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని జరుపుతున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌, అధ్యక్షుడు సీఆర్‌ రావు తెలిపారు.

2014లో గుడివాడలో, 2015లో హైదరాబాద్‌లో, 2016లో చెన్నైలో జరిపామని.. ఈ సంవత్సరం డిసెంబర్‌ 16న ఏలూరులో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుపుతున్నామని వారువివరించారు. అనేక ఉత్తమ చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు “జీవిత సాఫల్య పురస్కారం” అందజేస్తున్నారు. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గీతం విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి - "విద్యా రత్న",  ప్రముఖ నటులు, సినీ, నాటక రచయిత గొల్లపూడి మారుతీరావుకి "సినీ రత్న", అత్యధిక చలన చిత్ర పంపిణీదారులు ఉషా ఫిలిమ్స్ అధినేత డాక్టర్. వి.వి. బాల కృష్ణారావుకు "విశిష్ట వ్యాపార రత్న", కార్మిక స్థాయి నుండి ప్రజాకవి గా ఎదిగి ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ప్రజాకవి వంగపండు ప్రసాద రావుకు "రంగస్థల రత్న" పురస్కారాలను అందిస్తున్నారు. 
మాతృదేశంలోనే ఉండి వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్. గుడారు జగదీష్‌కు "వైద్య రత్న", ‘మానవ సేవే మాధవ సేవగా’ భావిస్తూ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి విద్యార్థులకు అవసరమైయ్యే శిక్షణను అందిస్తూ, తన స్వగ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న మాయలూరి మనోహర్ రెడ్డికి - "సేవారత్న", అంధత్వ లోపం ఉన్నప్పటికీ లెక్కచేయక తనకున్న అద్భుతమైన జ్ఞాపక శక్తి, స్ఫూర్తిదాయక ప్రసంగాలతో విశేష ప్రతిభ కనబరుస్తున్న  షాకీర్ మహమ్మద్‌కు -  "వినూత్న రత్న",  ప్రపంచంలోనేమొదటి మహిళా పైలట్‌గా (బోయింగ్ - 777) ఎంపికైన కెప్టెన్ అన్నే దివ్యకు  "యువ రత్న"  పురస్కారాలను అందజేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర, అధ్యక్షులు డాక్టర్. సి.ఆర్. రావు ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.  
ఈ సంస్థ లో డాక్టర్. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు)  డాక్టర్. సి.ఆర్. రావు (అధ్యక్షులు) రావు కల్వల (ఉపాధ్యక్షులు), శారద అకునూరి ( కార్యదర్శి), చలపతి రావు కొండ్రకుంట (కోశాధికారి), రవి కొండబోలు, ధామా భక్తవత్సలు , డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఏలూరులో 4వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి మోహన్ ముళ్లపూడి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.orgను సందర్శించండి.