చిక్కడపల్లి, మార్చి19(ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత ఆచార్య బేతవోలు రామ బ్రహ్మానికి మద్దాలి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. నృత్య కిన్నెర, కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, కిన్నెర కల్చరల్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో త్యాగరాయగానసభలో మంగళవారం ఆధ్యాత్మిక గ్రంథ రచయిత డా. మద్దాళి సుబ్బారావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కారాన్ని ప్రదానం చేసిన డా. కేవీ రమణాచారి మాట్లాడుతూ బేతవోలు రామబ్రహ్మానికి ఈ పురస్కారం ఇవ్వడం సముచితమన్నారు. తాను పీహెచ్‌డీ చేయడానికి రామబ్రహ్మం పద్యాలు స్ఫూర్తినిచ్చాయన్నారు. కార్యక్రమంలో డా. ఎన్‌ గోపి, ఆచార్య ముదిగొండ  శివప్రసాద్‌, డా. ఓలేటి పార్వతీశం, ఏఎస్‌ మూర్తి,ఆర్‌ ప్రభాకర్‌రావు, మద్దాళి రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.