రవీంద్రభారతి,హైదరాబాద్: సమాజాన్ని చైతన్యం చేసే సినిమాలు రావాలని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. ఆదర్శ ఫౌండేషన్‌, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గురువారం ప్రముఖ నటుడు శ్రీకాంత్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేష్‌ తదితర సభ్యులను రోశయ్య సత్కరించారు. అనంతరం శరణం గచ్చామి సినిమా యూనిట్‌ సభ్యులను పలువురు సత్కరించారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ ప్రతిభ గల నటులను గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయమన్నారు. హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ తన సినిమా జీవితాన్ని గుర్తించి ఆదర్శ ఫౌండేషన్‌ వారు సత్కరించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. సభకు ముందు ఈనాటి ఈ బంధమేనాటిదో శీర్షికన నిర్వహించి సంగీత విభావరి అలరించింది. ప్రముఖ గాయని ఆమని నేతృత్వంలో గాయకులు అద్భుత పాటలతో ఓలలాడించారు.