21-05-2018: ఆ రోజుల్లో సినీ రంగంలో ఆమెను దుక్కిపాటి గారు చాలా ప్రోత్సహించేవారు. ‘సెక్రటరీ’, ‘జీవన తరంగాలు’, ‘మీనా’ లాంటి నవలలతో ఆమె చాలా పేరు తెచ్చుకుంది. పత్రికల్లో ఆమె సీరియల్స్, ఆ వెంటనే బెజవాడలో ప్రింటయ్యే ఆమె నవలలు... హాట్ కేకులు.యద్దనపూడి సులోచనారాణి పేరు చెప్పగానే నాకు ఓ అందమైన పాపులర్ రచయిత్రి రూపం గుర్తుకొస్తుంటుంది. 1960,70లలో నవలా రచయిత్రిగా ఆమె సంపాదించుకున్న పేరు అంతా ఇంతా కాదు. నిజానికి, ఆమె పెద్ద చదువులేమీ చదువుకోలేదు. కానీ, నలుగురూ చదువుకొనే రీతిలో, అంగీకరించే రీతిలో చక్కటి నేరేషన్తో రాసేసేది. ఎక్కువ తికమకలు లేకుండా, హాయిగా చదివించేలా, యాజ్ ఇట్ ఈజ్గా ఒక సినిమా అయితే ఎలా ఉండాలో, అలా కథ రాసే అద్భుతమైన రచయిత్రి ఆమె.ఆమెతో నా తొలి పరిచయం ఏమిటంటే, సినిమాలో ఆమె, నేను కలసి సినిమా కథ రాయడం. నా జీవితంలో మొట్టమొదటి సినిమా కథ ఆమెతోనే కలసి రాశా. అది దుక్కిపాటి మధుసూదనరావు గారి అన్నపూర్ణా వారి ‘ఆత్మగౌరవం’. దర్శకుడిగా కె. విశ్వనాథ్ గారికి కూడా అదే మొదటి సినిమా. ఆ సినిమా కథా చర్చలు నాకిప్పటికీ గుర్తే.
హైదరాబాద్లో నాంపల్లి నుంచి మసాబ్ ట్యాంక్ దగ్గర విజయనగర కాలనీకి వెళుతూ ఉంటే, ఇప్పటి ఫిల్మ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ ఆఫీసు వెనకాల శాంతినగర్లో సులోచనారాణి ఇల్లు. వాళ్ళింట్లోనే ఈ సినిమా కథా చర్చలు జరిగేవి.నేను, ఆమె, దుక్కిపాటి గారు, విశ్వనాథ్... అందరం కలసి కథా చర్చలు చేసేవాళ్ళం. అప్పటికే ఆమె మంచి కథా రచయిత్రి. ఆమె తనదైన పద్ధతిలో మా సినిమా కథ, సందర్భానికి తగ్గట్లు పదిహేను, ఇరవై పేజీలు రాసేసేవారు. దానిలో నుంచి సినిమాకు ఎంత కావాలో అది తీసుకొనేవాళ్ళం. ఆ ‘ఆత్మగౌరవం’ సినిమాకు కథ అంటూ నా పేరు, ఆమె పేరు వేశారు. అది 53 ఏళ్ల క్రితం 1965 నాటి మాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ తెలుగు చిత్రాలను ప్రోత్సహించడానికి నంది అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టి అది రెండో ఏడాది. నేను కథ రాసిన ఆ సినిమాకు ఉత్తమ కథకు నంది అవార్డు వచ్చింది. ఆ నంది అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్లో గాంధీ భవన్ దగ్గర గాంధీ గ్రౌండ్స్లో జరిగింది. రాష్ట్ర గవర్నర్ పట్టమ్ ఎ. థాను పిళ్ళై, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి... ఇద్దరూ సతీ సమేతంగా హాజరైన ఆ అవార్డుల ప్రదానోత్సవంలో నేను, సులోచనారాణి కలసి ఉత్తమ కథకు అవార్డు అందుకున్నాం.
అప్పటికి ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేస్తూ, నాటకాలు, సినిమాలు అంటూ పని చేస్తున్న నేను ఆ తరువాత ఆమెతో చాలా తరచూ కలిసిన సందర్భాలున్నాయి. అయితే, ఆమెతో కలసి సినిమాకు పనిచేసే సందర్భం మాత్రం రాలేదు. ఆ రోజుల్లో సినీ రంగంలో ఆమెను దుక్కిపాటి గారు చాలా ప్రోత్సహించేవారు. ఆ టైమ్లోనే మరోపక్క ‘సెక్రటరీ’, ‘జీవన తరంగాలు’, ‘మీనా’ లాంటి నవలలతో ఆమె చాలా పేరు తెచ్చుకుంది. పత్రికల్లో ఆమె సీరియల్స్, ఆ వెంటనే బెజవాడలో ప్రింటయ్యే ఆమె నవలలు... హాట్ కేకులు. రచయిత్రిగా ఆ రోజుల్లో ఆమె సంపాదన బాగుండేది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళలో పఠనాసక్తిని బాగా పెంచి, అందరినీ అలరిస్తూ, ఆనందపరుస్తూ నవలలు రాసిన పాపులర్ రచయిత్రిగా ఆమె పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’.