చిక్కడపల్లి, హైదరాబాద్, జూలై17(ఆంధ్రజ్యోతి): తెలుగు జాతి గర్వించదగ్గ కవి సినారె అని సంఘసేవకురాలు డా. కొత్త కృష్ణవేణి అన్నారు. వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ప్రముఖ గాయని సుజారమణ బృందంచే నిర్వహించిన ‘నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని’ సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డా. కొత్త కృష్ణవేణి ముఖ్యఅతిథిగా పాల్గొని గాయని సుజారమణను సన్మానించారు. కార్యక్రమంలో వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి పాల్గొన్నారు.