చిక్కడపల్లి, అక్టోబర్20(ఆంధ్రజ్యోతి): చిమ్మపూడి ఫౌండేషన్, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో చిమ్మపూడి ఫౌండేషన్ ప్రారంభోత్సవ సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ‘పాట పరిమళించినవేళ’ పుస్తకాన్ని ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి ఆవిష్కరించి సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అధ్యక్షురాలు డా. నందమూరి లక్ష్మీపార్వతి, నంది అవార్డుగ్రహీత హెచ్వీఎల్ ప్రసాదరావు, చిమ్మపూడి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చిమ్మపూడి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి చిమ్మపూడి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించారు. చిమ్మపూడి వెంకటసుబ్బమ్మ స్మారక పురస్కారాన్ని నదుల శివమ్మ, చిమ్మపూడి వెంకట సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని వజల నాగసాయి అశ్విన్కుమార్, డా. కావూరి పాపయ్యశాస్త్రి, స్మారక పురస్కారాన్ని మెరుగు వెంకటదాసుకు ప్రదానం చేశారు.