చిక్కడపల్లి, జూలై18 (ఆంధ్రజ్యోతి): వేదగిరి రాంబాబు కథానిక అంశాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి ఎంతో కృషి చేశారని వక్తలు పేర్కొన్నారు. త్యాగరాయగానసభలో ఎంవీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారంరాత్రి ప్రసిద్ధ రచయిత, కథానికాజీవి డా. వేదగిరి రాంబాబు సాహిత్య, వ్యక్తిత్వ చైతన్యంపై ప్రసంగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త విహారి, ప్రముఖ రచయిత్రి డా. కేబీ లక్ష్మి, శంకరమంచి పార్థసారథి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కథానికకు విశిష్ఠ ప్రాచుర్యం తేవడానికి ఆయన జీవితాంతం కష్టపడ్డారన్నారు. ఆయన సాహితీ కృషి ఎంతో విలువైందన్నారు. కథానికా రచయితలను ప్రోత్సహించడం, కథానికా సదస్సులు ఏర్పాటు చేయడం వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం చేసేవారన్నారు. ఆయన సాహిత్య వ్యక్తిత్వ చైతన్యం ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కళా జనార్దనమూర్తి, వేదగిరి విజయచంద్ర,రమణ తదితరులు పాల్గొన్నారు.