16-12-2017: ప్రపంచ తెలుగు మహాసభల్లో రెండో రోజున గౌరవ అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. మొదటి రోజు అంతా వీవీఐపీల హడావిడి ఉంటుందని షూటింగులోనే గడిపేశా. కానీ, రెండో రోజున మాత్రం ఫుల్ డే షూటింగులన్నిటికీ సెలవు పెట్టేశా. హాయిగా సాహిత్య సభలు, సమావేశాలు, అవధానాలు వగైరాల్లో రోజంతా గడిపేస్తున్నా.మునుపెన్నడూ... ఇన్ని లేవు!మనకున్న కవులు, మన పద్యం... ఇలా అన్నిటినీ కొత్త తరాలకు గుర్తు చేస్తున్నాయీ సభలు. తెలుగు భాషకు మళ్ళీ వైభవం కలుగుతోందని అనిపిస్తోంది. ఇక్కడ మనమే ఇంగ్లీషు మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నామేమో కానీ, అమెరికాలోని పిల్లలు ఇటీవల సిలికానాంధ్ర సంస్థ వారి ‘మన బడి’ కార్యక్రమం ద్వారా తెలుగు బాగా నేర్చుకుంటున్నారు. కొంత మంది పిల్లలైతే స్వయంగా పద్యాలు కూడా రాస్తున్నారు.వాళ్ళు పద్యాలు రాయడం చూసి, ఆశ్చర్యపోయా.
మరో విషయం ఏమిటంటే, గడచిన దశాబ్ది కాలంగా జరిగినన్ని అవధానాలు, లక్ష గళార్చనలు, కూచిపూడి నృత్య సమ్మేళనాలు, సాహిత్య సభలు మునుపెన్నడూ జరగలేదు. ‘తానా’, ‘ఆటా’ లాంటి సభల కోసం కాకుండా, కేవలం తెలుగు భాష, సంస్కృతి గురించే జరిగే సభల కోసమే నేను కనీసం 20 సార్లు రకరకాల దేశాలు తిరిగా.రానూపోనూ ఖర్చులు, బస, చివరకు పారితోషికం కూడా ఇచ్చి మరీ వాళ్ళు అలా భాష, సాహిత్యం, సంస్కృతి సభలకు పిలుస్తున్నారంటే భాషాభిమానం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి. అయితే, తమిళ, మలయాళీలతో పోలిస్తే మనమింకా వెనుకబడే ఉన్నాం. వాళ్ళకు ఉన్నంతగా మనకు మన భాష, సంస్కృతిపై వీరాభిమానం లేదన్నది నిజం.పెద్ద బాలశిక్షలా... పద్య బాలశిక్ష!ఒకప్పుడు మనకు తెలుగు నేర్పడానికి ‘పెద్ద బాలశిక్ష’ లాంటివి ఉండేవి. అలా... ఇప్పటి తరానికి మన పద్యం, దాని విలువ తెలియజెప్పేలా ...‘పద్య బాలశిక్ష’... అని మొదలుపెట్టాలనుకుంటున్నా. అంటే, పిల్లలందరికీ అర్థమయ్యేలా సరళమైన పద్యాలు తీసుకొని, వాటిని రాగ, భావయుక్తంగా పాడించి, వాటికి నా శైలిలో సులభంగా భావం చెప్పాలని ఆలోచన. ఇప్పటికే పద్యాల ఎంపిక కూడా పూర్తయింది. యూ ట్యూబ్లో పెడతాం.