విలక్షణమైన నటుడు శోభన్‌బాబు : రోశయ్య 

సినిమాలు సమాజాన్ని సన్మార్గంలో నడపాలి : చందూలాల్‌ 

హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాలు తీసిన విలక్షణమైన నటుడు శోభన్‌బాబు అని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. మధుర మైన కంఠం కలిగిన ఎస్పీ బాలుకు శోభన్‌బాబు పేరిట స్వర్ణకంకణం అందజేయడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం శోభన్‌బాబు జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. శోభన్‌బాబు జయంతి సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన శోభన్‌బాబు- శృతిలయ -2017 స్వర్ణకంకణాన్ని ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ శోభన్‌బాబు క్రమశిక్షణ కలిగిన నటుడని, ఆయన చిత్రాలు చాలా బాగుండేవన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ ఆనాటి చిత్రాలు చూడదగ్గేవిగా ఉండేవని తెలిపారు. సినిమాలు సమాజాన్ని సన్మార్గంలో నడపాలన్నారు. ఎస్పీ బాలు మాట్లాడుతూ తాను శోభన్‌బాబు అభిమానినని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ఆర్‌ఎన్‌.సింగ్‌, జేబీ.రాజు, వంశీరామరాజు తదితరులు పాల్గొన్నారు. సభకుముందు శోభన్‌ బాబు సినీపాటలను ప్రముఖగాయని ఆమని నేతృత్వంలో ఆలపించారు.