చిక్కడపల్లి, మే16(ఆంధ్రజ్యోతి): దేశం గర్వించదగ్గ కూచిపూడి నృత్యకళాకారిణి స్వాతీసోమనాథ్‌ అని తెలంగాణ బీసీ కమిషన్‌ సీనియర్‌ సభ్యుడు డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. శ్రీ నటరాజ సంగీత నృత్య అకాడమీ ఆధ్వర్యంలో గురువారం త్యాగరాయగానసభలో సుప్రసిద్ధ నాట్యాచారిణి, నాట్య కళాకారిణి స్వాతీసోమనాథ్‌కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ కూచిపూడిలో విభిన్న నృత్యరూపకాల ప్రదర్శనలతో స్వాతీసోమనాథ్‌ ఎంతో ప్రఖ్యాతిగాంచారని ప్రశంసించారు. అసమాన ప్రతిభతో ఆమె రూపొందించిన వాత్సాయన కామసూత్ర నృత్యరూపకం నాట్యగురువుగా ఆమె స్థానాన్ని పతాకస్థాయికి చేర్చిందన్నారు. ఈ సందర్భంగా స్వాతీసోమనాథ్‌ను పులువురు నృత్యకళాకారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. విజయకుమార్‌, కళా జనార్దనమూర్తి, దైవజ్ఞశర్మ, అకాడమీ అధ్యక్షురాలు లిఖిత కనకదుర్గ, శ్రీనివాసాచారి, సింధుజరావు, వైష్ణవి రావు పాల్గొన్నారు.