రవ్వా శ్రీహరిది సామాన్యుల సాహిత్యం.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
తెలంగాణ పదాలతో నిఘంటువు రావాలి.. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్
లక్ష తెలంగాణ పదాలతో నిఘంటువు.. తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో తెలుగుభాషకు ప్రాధాన్యమివ్వాలని, పాలనా వ్యవహారాల్లో తెలుగు భాష వాడకం పెరగాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆచార్య రవ్వా శ్రీహరి పంచసప్తతి మహోత్సవం సందర్భంగా ఆయన సమగ్ర రచనలపై అభినందన సమితి ఆధ్వర్యంలో సమాలోచనల కార్యక్రమాన్ని తెలుగు యూనివర్సిటీలో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ సామాన్యులకు చేరువయ్యే సాహిత్యాన్ని రవ్వా సృష్టించారని తెలిపారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని పదాలు డిక్షనరీలో ఉండాలని, మనం వాడుతున్న పదం నిఘంటువులో దొరక్కపోతే ఆ పదానికి ఆర్థం లేదన్నారు. తెలంగాణ పదాలేవో తేల్చాలని, భాషకు సంబంధించి మౌలిక వ్యవస్థను నిర్మాణం చేయాల్సిన అవసరముందన్నారు. శ్రీహరి సంప్రదాయాన్ని అభిమానించడంతో పాటు జాతీయవాది కూడా అన్నారు. రవ్వా శ్రీహరి భాషపై శాస్ర్తీయ దృక్పథం కలిగిన వారని ఇలాంటి వారు .. ఇప్పటికాలానికి అవసరమన్నారు. తెలుగు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ లక్ష తెలంగాణ పదాలతో నిఘంటువు తీసుకురానున్నామని, అందులో రవ్వా శ్రీహరి పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు కోవెల సుప్రసన్నాచార్యులు, ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి, ఆచార్య కె.యాదగిరి పాల్గొన్నారు.