మొదలి నాగభూషణశర్మ సంతాప సభలో వీసీ ఎస్వీ సత్యనారాయణ
రవీంద్రభారతి, హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రచయితగా, నటుడిగా, నాటక ప్రయోక్తగా తెలుగు నాటక రంగానికి మొదలి నాగభూషణ శర్మ చేసిన సేవలు మరువలేనివని, తెలుగు నాటక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. తెలుగు వర్సిటీ రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో గురువారం వర్సిటీలోని కాన్ఫరెన్స్హాల్లో మొదలి నాగభూషణశర్మ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం వీసీ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు వర్సిటీ రంగస్థల కళల శాఖాధిపతిగా నాగభూషణశర్మ చేసిన సేవలను గుర్తుచేశారు. అనేకమంది విద్యార్థులను నాటక రంగంలో నిష్ణాతులుగా తయారు చేయడంలో కీలకపాత్ర వహించారని అన్నారు. వర్సిటీ రంగస్థల కళల శాఖాధిపతి డా.కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ నాగభూషణశర్మ తనకు గురువు అని, గురువును కోల్పోవడం తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన పేరిట నాటక లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల, రంగస్థల అధ్యాపకురాలు డా.పద్మప్రియ, బి.హెచ్.కళ్యాణి, మల్లాది గోపాలకృష్ణ, డా.ఆంటోని రాజ్, పీహెచ్డీ విద్యార్థులు మంచాల మహేశ్వర్, సుభద్ర, మల్లేష్, ఖాజాపాషా, సునేత్రి, రమేష్, ప్రశాంత్, ప్రముఖ రంగస్థల కళాకారులు సురభి బాబ్జి, పుండరి, ప్రకాష్, మేక రామకృష్ణ, సుజాత, కళ్యాణ్ చక్రవర్తి, గడ్డం వెంకన్న, రెడ్డిశ్యామల తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.