ఖైరతాబాద్/హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త తాపీ ధర్మారావు పురస్కారాన్ని సీనియర్ పాత్రికేయులు, రచయిత, సాహితీ విమర్శకులు సతీష్ చందర్ అందుకున్నారు. ‘ఐఐఎంసీ’ కళాశాలలో ఆదివారం పురస్కార ప్రదానోత్సవం జరిగింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి తదితరులు సతీష్ చందర్కు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సతీ్షచందర్ రచనలు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. సతీష్ చందర్ మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే తాపీ ధర్మారావు రచనలను చదివేవాడినని, ఆయన పేరిట పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఏటుకూరు ప్రసాద్, తాపీ ధర్మారావు మనవరాలు విమల సోహన్, సమావేశ నిర్వాహకులు డాక్టర్ సామల రమేష్ బాబు పాల్గొన్నారు.