పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు

18న తెలంగాణ రాష్ట్ర మహాసభ

పంజాగుట్ట/హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాధనలో రచయితలు చేసిన కృషి, పాత్ర మరువలేనిదని ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈనెల 18న బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి, పొట్లపల్లి వరప్రసాద్‌రావు, వేణుగోపాల్‌, ఎం.మల్లయ్యలతో కలిసి ఆయన మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పడక ముందు రచయితలు నిర్వహించిన పాత్ర వేరు.. ఇప్పుడు నిర్వహించాల్సిన పాత్ర వేరు అని పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. భాషా సాహిత్యాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని జయధీర్‌ తిరుమలరావు అన్నారు. 200 మందికి పైగా రచయితలు మహాసభల్లో పాల్గొంటారని వివరించారు.