మధిర, నవంబరు 11: గ్రామీణ స్థాయిలో పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసుకొచ్చేందుకు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించటం అభినందనీయమని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో రామభక్తసీతయ్య కళాపరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాలోత్సవ్ 2017 పోటీలను శనివారం మంత్రి తుమ్మల, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలకు, కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కళలకు, కళాకారులకు మధిర పుట్టినిల్లని, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్ కళారంగంపై తనకున్న మక్కువతో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినీ, విద్యార్థులు చదువుతోపాటు కళలలోనూ రాణిస్తున్నారని తెలిపారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు శాస్త్రీయ, జానపద నృత్యాల్లో తమ ప్రతిభను పోటాపోటీగా ప్రదర్శించారు.