హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఇందిరాపార్కు చౌరస్తా హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ఛాయాసంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత ఉణుదుర్తి సుధాకర్ రచించిన తూర్పుగాలులు కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్, ఆచార్య జయధీర్ తిరుమలరావు, ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు ఓల్గా, రచయిత ఎ.కె.ప్రభాకర్లు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ సామాజిక చరిత్రను సాహిత్య ప్రక్రియ ద్వారా దేశంలో జరిగిన వివిధ ఘట్టాలను రచయిత సుధాకర్ కథల ద్వారా ప్రస్తుత సమాజానికి అందించారన్నారు. రచయిత సుధాకర్ తూర్పుగాలులు కథలో సమకాలీన జీవిత చరిత్ర చెప్పారని, సమాజంలో ఆస్తిత్వం, వివక్షవంటివి మొదటి కథలో చెబితే 8వ శతాబ్దంలో జరిగిన చరిత్రను చివరి కథలో చెప్పారని పేర్కొన్నారు. బ్రాహ్మణీయ సమాజానికి వ్యతిరేకంగా బుద్ధుడు బౌద్దమతాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చాడన్నారు. ప్రస్తుతానికి, గతానికి సంబంధించిన చర్చే చరిత్ర అని అన్నారు. బౌద్ధమతం రాకతో చైనాలో మార్పు వచ్చిందని, అందరూ ఒక్కటే అనే భావన వచ్చిందన్నారు. మతం సామాజిక చైతన్యంగా రావాలని, మత మౌఢ్యం, మతం కలిస్తే పరిస్థితి ఏమిటనేది సమకాలీన సమాజంలో చూపుతుందన్నారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ రచయిత సుధాకర్ విలక్షణమైన ఇతివృత్తంలో తూర్పుగాలులు కథలను రచించారన్నారు. ఆ కథలు అత్యుత్తమమైన సజీవ కథలని కొనియాడారు. అనంతరం రచయిత్రి ఓల్గా, ఎ.కె.ప్రభాకర్లు ఆ పుస్తకంపై మాట్లాడారు.