తిరుపతి(టీటీడీ), నవంబరు 15: టీటీడీ ఆగమ సలహా మండలి ప్రధాన సభ్యుడు, వైఖానస ఆగమశాస్త్ర పండితుడు వేదాన్తం దేశికాచార్యులు(82) కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని నివాసగృహంలో గురువారం రాత్రి 10.30కి అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. 1987-94 వరకు టీటీడీ ఆస్థాన పండితుడిగా కొనసాగిన దేశికాచార్యులు, తరువాత నుంచి ఆగమ సలహామండలి ప్రధాన సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. పలు వేదాంత గ్రంథాలకు పరిష్కర్తగా, సమీక్షకుడిగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవ, పుష్పయాగాది ఉత్సవాలను పర్యవేక్షిస్తూ టీటీడీకి నిర్మాణాత్మక సలహాలనిస్తూ వచ్చారు. శ్రీవారి ఆలయంలో విశేషపూజ, పద్మావతి పరిణయం, గోదా పరిణయం ఉత్సవాలను శాశ్వత ఉత్సవాలుగా నిర్వహించేందుకు కృషి చేశారు. దేవదాయశాఖ పరిధిలోని అనేక ఆలయాలకు వాస్తు ఆగమ సలహాదారుగా కూడా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.