కాలిఫోర్నియా: ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి(79) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా సులోచనారాణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కాలిఫోర్నియా రాష్ట్రంలోని కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుమార్తె శైలజ తెలిపారు. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు ఎవ్వరూ సాటిరారని సులోచనారాణి నిరూపించుకున్నారు. ఆమె రాసిన పలు కథలు సినిమాలుగా కూడా తీశారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మువ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు.యద్దనపూడి సులోచనారాణి తాను పరిశీలించిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకుని తొలుత రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా మారుతున్న ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి వారి ఊహల్లో నుంచి వచ్చేట్టుగా పాత్రలను సృష్టించుకుని వాటిని సజీవ పాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. ఆమె రచనల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, మధ్య తరగతి అమ్మాయి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, మాటకారితనం ఎక్కువగా కనిపిస్తాయి. ఆగమనం, ఆశల శిఖరాలు, ఆత్మీయులు, అగ్నిపూలు, అభిశాపం, ఆహుతి, అమర హృదయం, బహుమతి, బంధీ, బంగారు కలలు, మీనా, జీవన తరంగాలు వంటి ప్రముఖ నవలలను సులోచనారాణి రచించారు.