ఏబీఎన్‌ ‘ఇన్‌సైడ్‌’కు అవార్డు

హైదరాబాద్, బంజారాహిల్స్‌: యువకళావాహిని, నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాట్స్‌) ఫిలిం ఎక్స్‌లెన్సీ, టెలివిజన్‌ అవార్డుల ప్రదానోత్సవం బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో బుధవారం కనుల పండువగా జరిగింది. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ భవానీ ప్రసాద్‌, నాట్స్‌ అధ్యక్షుడు మోహన్‌కృష్ణ మన్నవ, అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్‌ అధ్యక్షుడు సారపల్లి కొండలరావు, గజల్‌ శ్రీనివాస్‌ అవార్డులు ప్రదానం చేశారు. జీవన సాఫల్య అవార్డుకు సినీ నటుడు కృష్ణంరాజు ఎంపికయ్యారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుమార్తెలు సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప అందుకున్నారు. ఫిల్మ్‌ ఎక్స్‌లెన్సీ అవార్డులను నటుడు సాయిచంద్‌, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌, జీవితకాల విశేష పురస్కారం ప్రదీప్‌, శృతి అందుకున్నారు. టెలివిజన్‌ అవార్డ్స్‌ ఉత్తమ ఫీచర్స్‌ విభాగంలో ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ప్రసారం చేస్తున్న ‘ఇన్‌సైడ్‌’కు అవార్డు లభించింది. ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీదుర్గ అవార్డును అందుకున్నారు. జస్టిస్‌ భవానీప్రసాద్‌ మాట్లాడుతూ.. లక్షలమందికి వినోదం పంచుతున్న కళాకారులను గుర్తించి సన్మానించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు.