సినీ నటుడు జయప్రకాష్రెడ్డి
సత్తెనపల్లి,గుంటూరు: సినిమా రంగం డబ్బు ఇచ్చిందని, నాటక రంగం సంతృప్తినిచ్చిందని సినీనటుడు జయప్రకాష్రెడ్డి తెలిపారు. ప్రగతి కళామండలి గౌరవ అధ్యక్షుడు నూతలపాటి సాంబయ్యను బుధవారం ఆయన గృహంలో జయప్రకాష్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రేక్షకుల కోసమే నాటకాల్లో నటిస్తున్నానన్నారు. ప్రేక్షకుల మెప్పు, ఆశీర్వాదం పొందటంలో సంతృప్తి ఉందన్నారు. రంగస్ధలాన్ని ఎప్పుడూ మర్చిపోలేనన్నారు. సినిమాల్లోకి వచ్చే కళాకారులు ముందుగా నాటకం వేయాలని సూచిస్తున్నానన్నారు. చాలామంది శిక్షణ కూడా లేకుండా సినిమా రంగంలోకి వస్తున్నట్లు తెలిపారు.
నాటక రంగాన్ని టికెట్ కొని చూసి ప్రేక్షకులు ప్రోత్సహించాలన్నారు. తన తండ్రి ఇచ్చిన స్పూర్తితోనే నాటకాల్లో నటించి ఈ స్ధాయికి ఎదిగానని తెలిపారు. ఎమోషనల్ పాత్రలలో నటించాలని ఉందన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా, గీతా ఆర్డ్స్ సినిమా, రానా సినిమాలలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ప్రగతి కళామండలి ఆధ్వర్యంలో నిర్వహించే నాటకోత్సవాలలో తన అలెగ్జాండర్ ప్రదర్శనను ఇవ్వనున్నట్లు తెలిపారు. వంద ప్రదర్శనలు ఇవ్వాలని రచయిత పుస్తకాల వెంకటేశ్వరరావు కోరిక మేరకు ప్రదర్శనలు ఇస్తున్నానని చెప్పారు. నాటక రంగాన్ని కళాకారులు, ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో అబ్బూరి సత్యనారాయణ కూడా ఉన్నారు.