హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: జమున సహజనటి అని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. శ్రీసాయి అలేఖ్య సాంస్కృతిక సంఘసేవా సంస్థ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అలనాటి ప్రముఖ నటి జమునారమణారావుకు జీవితసాఫల్య పురస్కారం ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్, కాచం ఫౌండేషన్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమానికి రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని జమునను సన్మానించి జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
జమునారమణారావు మాట్లాడుతూ రోశయ్య సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేతులమీదుగా ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్న తొలి నటీమణిగా తనకు గౌరవం దక్కిందన్నారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు అరుణాఅశోక్, అశోక్, కమలాకరశర్మ కాచం సత్యనారాయణగుప్తా, గీతాశేఖర్, సత్యం, అధ్యక్షత వహించగా సరస్వతి ఉపాసకుడు దైవజ్ఞశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచశీల, గీత, సాయి విద్యానికేతన్, విజయ ఫ్యూచర్ కిడ్స్, రెయిన్ బో స్కూళ్లు, వెంకట్ డాన్స్, భానుప్రియ నృత్యఅకాడమీ, రవి డాన్స్ అకాడమీ, ప్రసన్నమోహన్ నృత్య, రమాదేవి నృత్యఅకాడమీల విద్యార్థులసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.