మైమరపించిన ‘మన ఊరే తల్లి వేరు’
భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం
రవీంద్రభారతి,హైదరాబాద్: హేవళంబి నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో మన ఊరే తల్లి వేరు శీర్షికన కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎస్టీ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఎస్.చెల్లప్ప, బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎ్స.రాములు, ప్రముక కవి తిరుమల శ్రీనివాసాచార్యులు అమ్మంగి వేణుగోపాల్, జూలూరి గౌరీశంకర్, తిరునగరి దేవికాదేవి, ఎస్వీ సత్యనారాయణ పాల్గొనగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సాహిత్యంలో ఎన్నో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం యుగాదిని నిలుస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కవిసమ్మేళనాలను నిర్వహిస్తున్నామన్నారు. కవిసమ్మేళనంలో చెల్లప్ప తేజమ్మ చెప్పింది కవితతో ప్రారంభించారు. ఈ కవి సమ్మేళనంలో సుమారు 65 మంది కవులు పాల్గొని మన ఊరే తల్లి వేరు అంశంపై కవితలను చదివారు. కార్యక్రమంలో వడ్డేపల్లి కృష్ణ, త్రివేణి, అనిశెట్టి రజిత, దేవరాజు, జూపాక సుభద్ర, ప్రముఖ కవులు కవితలను వినిపించారు.