చిక్కడపల్లి, ఆగస్టు17(ఆంధ్రజ్యోతి): మా నిజాం రాజు జన్మజన్మల బూజు అని మహాకవి దాశరథి అన్నారని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పేర్కొన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా,త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలో నెలనెలా తెలుగు వెన్నెల 143వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి కవిత్వం- సినీ కవిత్వం అనే అంశంపై అశోక్‌తేజ మాట్లాడుతూ దాశరథి ఒక సూరీడు అన్నారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ ఆయన కవిత్వం రాశారన్నారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు జైల్లో పెడితే అక్కడ దొరికిన బొగ్గుముక్కలతో గోడలపై కవిత్వం రాసిన కవి దాశరథి అన్నారు. ఈ సమావేశంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ట్రస్టీలు డా. తెన్నేటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజను ఘనంగా సన్మానించారు.