రవీంద్రభారతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): సినిమా పరంగా ఎన్టీఆర్, ఏఎన్నార్లను ఎంతగా గౌరవిస్తానో సామాజికంగా గద్దర్ను అంతగా గౌరవిస్తానని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. గద్దర్ లివింగ్ లెజెండ్ అని ఆయన అభివర్ణించారు. బుధవారం రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్, సీల్వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్కు, కొమురం భీం పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.నారాయణమూర్తి గద్దర్ను ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం గానం చేసిన గద్దర్కు జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన కొమురం భీం పురస్కారం అందజేయడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. అంటూ పాట పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. వైకే నాగేశ్వరరావు సభాధ్యక్షత వహించిన సభలో సీల్వెల్ కార్పొరేషన్ సీఈవో బండారు సుబ్బారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్ రఫీ, కొత్త కృష్ణవేణి, గీతామూర్తి పాల్గొన్నారు. గద్దర్ మాట్లాడుతూ సమాజంలో జ్ఞానయుద్ధం జరగాల్సిన అవసరముందని అన్నారు. కొమురం భీం పేరిటన నెలకొల్పిన పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘మీ పాదాలకు వందనాలమ్మా మా అమ్మలారా..’ అంటూ పాట పాడి అలరించారు. కార్యక్రమంలో భాగంగా గాయని వీఏ. లక్ష్మికి స్వరమంజరి బిరుదు ప్రదానం చేశారు. సభకు ముందు గాయకుడు, ప్రాజ్ఞిక వ్యవస్థాపకుడు ప్రవీణ్ నేతృత్వంలో సంగీత విభావరి నిర్వహించారు.