ఆంధ్రలోనా? తెలంగాణాలోనా?
పదేళ్లయినా తేల్చని కేంద్రం
తెలుగు రాష్ట్రాల చొరవ శూన్యం
ఏదో ఒక రాష్ట్రంలోనే ఏర్పాటు సాధ్యం
న్యూఢిల్లీ,(ఆంధ్రజ్యోతి): 2008 లో తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది...కానీ భాషాధ్యయన కేంద్రం మాత్రం నేటికీ మైసూరులోనే ఉంది.. మన తరువాత ఈ హోదా సాధించిన ఒడిసా సైతం తన రాష్ట్రానికి తెచ్చుకోగలిగింది.. కానీ మనమెందుకిలా? కారణం- ఆ కేంద్రం ఆంధ్రప్రదేశ్కి తరలించాలా లేక తెలంగాణాకా అన్న మీమాంస మానవవనరుల అభివృద్ధి శాఖ ఈ విషయాన్ని ఇప్పటికీ నాన్చుతూనే ఉంది నిధులు మురిగిపోతూనే ఉన్నాయి..
నేటికీ సిబ్బంది నియామకాలూ లేవు..
2008లో ప్రాచీన హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా నేటికీ ప్రాజెక్టు అధికారి, ఇతర ఉద్యోగుల నియామకాలే చేపట్టలేదు. మనతోపాటే అదే సమయంలో ప్రాచీన హోదా పొందిన కన్నడ భాష ఓ ప్రాజెక్టు అధికారిని, ఇతర సిబ్బందిని నియమించి రెండేళ్లు దాటింది. రెండో విడత కూడా మరో పీవోని నియమించేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజె్స(సీఐఐఎల్) కసరత్తు కూడా ప్రారంభించింది. మరి తెలుగుకు ఎప్పుడు పీవోని ఏర్పాటు చేస్తారనే ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) నో చెప్పేసింది. హైదరాబాద్కు తరలించాలని తెలంగాణ, గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలోకి తరలించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతున్నాయి. ఇప్పటిదాకా సాంకేతికంగా తెలుగు ప్రాచీన భాషాభివృద్ధి కేంద్రం మైసూర్లోని సీఐఐఎల్లో ఉంది. కానీ కేంద్రం వ్యవహారాలుచూసేవారెవరూ లేరు. తాత్కాలికంగా ఒకరిద్దరు ఆఫీసు అసిస్టెంట్లను నియమించారంతే.. పూర్తి స్థాయిలో కేంద్రం ఏర్పాటు కాలేదు. దానికి తోడు కార్యాలయ తరలింపు కూడా కొలిక్కిరాలేదు. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు కేంద్రం ప్రాచీన హోదా ఇచ్చింది. వీటిలో సంస్కృతానికి మినహా అన్నీ ఒకే రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. తెలుగు విషయానికొచ్చేసరికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మాకంటే మాకని పోటీపడ్డాయి. నిబంధనల ప్రకారం రెండు కార్యాలయాలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో విషయం ఎటూ తేలడం లేదు.
ప్రాచీన హోదాతో ఇవీ లాభాలు
ఒకసారి భాషకు ప్రాచీన హోదా వస్తే కేంద్రం నుంచి భాషాభివృద్ధికి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా నిధులు వస్తాయి. ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టు ఆఫీసర్తో కూడిన ఉద్యోగులు భాషాభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి ఎంహెచ్ఆర్డీకి పంపుతారు. వాటికి ఆమోదం తెలిపితే వాటిని అమలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ప్రాచీన సాహిత్యం ప్ర చురణ, అప్పటి కవుల చరిత్ర భద్రపరచడం, భాషా నిపుణులతో శిబిరాలు, సదస్సులు ఏర్పాటు చేయడం, భాషపై పరిశోధన వంటివి చేసేందుకు ఆస్కారం లభిస్తుంది.
వేగంగా స్పందించిన ఒడిసా
అన్నిటికంటే చివరిగా ప్రాచీన హోదా సంపాదించిన భాష ఒడిసా. దానికి 2014లో ఆ హోదా లభించింది. వెంటనే ఆ కేంద్రాన్ని మైసూర్ నుంచి సొంతరాష్ట్రానికి తరలించేందుకు ఒడిసా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కన్నడ భాషకూ తెలుగుతోపాటు హోదా వచ్చింది. కేంద్రం ఏటా ఇచ్చే నిధులను ఖర్చు చేస్తూ 50కిపైగా శిబిరాలు, సదస్సులు నిర్వహించింది. 50కిపైగా పరిశోధక విద్యార్థుల సాయంతో కన్నడ భాషాభివృద్ధి అంశాలను కేటాయించి అధ్యయనం చేయిస్తోంది. నీతిఆయోగ్ సూచనల ప్రకారం స్వయం ప్రతిపత్తి సంస్థల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని అన్ని కేంద్ర సంస్థలకు రెండేళ్ల కిందట మార్గదర్శకాలు ఇచ్చింది. దీనివల్ల తెలుగు కేంద్రం ఏర్పాటైనా స్వయం ప్రతిపత్తి రావడం కష్టమే అని కేంద్ర సంస్థ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
కేంద్రం తరలింపు
ఎంహెచ్ఆర్డీ పరిధిలోనే..
తెలుగు ప్రాచీన భాషాభివృద్ధి కేంద్రంలో సిబ్బంది నియామకం చేయాలన్నా, తరలింపుపై నిర్ణయం తీసుకోవాలన్నా ఎంహెచ్ఆర్డీ చేతులో ఉంటుంది. వారు నిర్ణయం తీసుకున్న తరువాత వాటిని అమలు చేయడం మా పని. కన్నడ, ఒడిసా వంటి ఇతర భాషలకు ఇప్పటికే పచ్చజెండా ఊపడంతో వాటి ప్రక్రియ చేపట్టాం. తెలుగు కేంద్రం ఏర్పాటుపై ఎటువంటి ఆదేశాలు రాలేదు.
- డి.గురేశ్వరరావు, సీఐఐఎల్ డైరెక్టర్