ఐటెమ్బాక్స్ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టాడతను. ఆపైన తన మాట నెరవేర్చుకోవడానికి సన్నాహాలు చేశాడు. మొదట ఒక భవంతిని, దాసదాసీ జనాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి తన ఆతిథ్యం స్వీకరించమని ఆ ధనికుణ్ణి ఆహ్వానించాడు. ఆ ధనికుడు ఊహించని విధంగా రెట్టింపు మర్యాదలతో విందు ఏర్పాట్లు చేశాడతను. విందు సమయంలో ధనికుడు ఎలాంటి కోరికలు కోరాడు? ఇంతకీ అతడీ మర్యాదలు ఎందుకు చేస్తున్నాడు?=======================నూరుకట్ల పిశాచం కథలుః 4.శాపాలు-వరాలురచనః వసుంధరఒక గ్రామంలో మనోజవుడు అనే ఓ పేదవాడు ఉండేవాడు. పంచభక్ష్య పరమాన్నాలతో ఒక్కసారైనా భోంచేయాలని అతడి కోరిక. జాతకఫలమో ఏమోకాని, ఎంత కష్టపడినా అతడికి తగిన ప్రతిఫలం లభించేది కాదు. అందువల్ల అతడి కోరిక తీరకుండా ఉన్నది. అతడు రోజూ అన్నంలో కలుపుకునేది ఆవకాయ ఒక్కటే!ఒకరోజు ఓ సన్యాసి దాహార్తుడై మనోజవుడి పూరిగుడిసె ముందు నిలబడ్డాడు. మనోజవుడు ఆయన్ను లోపలకు ఆహ్వానించి, మంచినీళ్ళు ఇచ్చాడు. సన్యాసి కాస్త కుదుటపడ్డాక, 'స్వామీ, నేనెంత శ్రమించినా భోజనానికి ఆవకాయబద్దతప్ప మరింకేమీ సమకూరడంలేదు. తమరు త్రికాలజ్ఞులు. నా దరిద్రం తీరే మార్గం చెప్పండి' అన్నాడు మనోజవుడు.అతడీ ప్రశ్న అడుగుతాడని ముందే ఊహించిన వాడిలా చిరునవ్వు నవ్విన సన్యాసి అతడి చేతికో వేరు ఇచ్చాడు. ‘‘ఇక్కడికి సమీపగ్రామంలో రత్నాకరుడు అనే ధనికుడున్నాడు. నీవు అతని ఇంటికివెళ్ళి నేనిచ్చిన ఈ వేరు నములు. నీ దరిద్రం తీరే మార్గం తెలియవచ్చు' అని చెప్పాడు.సన్యాసి చెప్పినట్లే చేశాడు మనోజవుడు. రత్నాకరుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ సన్యాసి ఇచ్చిన వేరు నమిలాడు. ఉన్నట్లుండి అతడికి కళ్ళు తిరిగాయి. పెద్దగా కేకపెట్టి, అక్కడే పడిపోయాడు. మళ్ళీ స్పృహ వచ్చేసరికి, అతడు మెత్తటి పరుపులమీద ఉన్నాడు. ఒకసేవకుడు వింజామరతో వీస్తున్నాడు. అలాంటి హాయి అనుభవించడం జీవితంలో అదే మొదటిసారి అతడికి. మనోజవుడు కళ్ళు తెరిచీ తెరవగానే ‘‘ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉన్నది?’’ అని అడిగాడో వ్యక్తి.అతడి వేషభాషలు చూసి, అతడే రత్నాకరుడై ఉంటాడని ఊహించాడు మనోజవుడు. అతడికి ఇప్పుడు ఒంట్లో తేలికగా, హాయిగా ఉన్నది. అందువల్ల, రత్నాకరుడికి తన కథంతా చెప్పగలిగాడు. ‘‘ఈ ఇల్లు నీదే అనుకో! నీకు మనసు తీరేదాకా ఇక్కడే ఉండి, హాయిగా అన్నీ అనుభవించు’’ అన్నాడు రత్నాకరుడు.
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT
Ltd.
Designed & Developed by AndhraJyothy.