ఆమె ఒక గయ్యాళిగంప. అందుకే ఆమె కొడుక్కి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. చివరకు మధ్యవర్తి గట్టిగా పూనుకోవడంతో, సవతితల్లి దాష్టీకంలో బతుకుతున్న తన కూతుర్ని ఆమె కొడుక్కిచ్చి పెళ్ళి చేశాడు ఒక తండ్రి. కోడలు అణిగిమణిగి ఉండేందుకు అవసరమైన పథకం ముందే సిద్ధంచేసుకుంది ఆ గయ్యాలిగంప. అనుకున్నవిధంగానే ఆ పథకం అమలు చేసింది. అప్పుడు కోడలు ఏం చేసింది?
‘‘అసలే బెట్టరోజులు అన్నయ్యా! రెండేళ్ళనుంచి వర్షాలు లేవు. పంటలు సరిగ్గా లేవు. ఈ ఏడు సీత పెళ్ళి చెయ్యడం కుదరదులే’’ అన్నాడు రాజయ్య.‘‘ఈ ఏడాదే చెయ్యాల్రా! తర్వాతమాత్రం రోజులు ఎలా ఉంటాయో ఏం చెప్పగలం? మంచి సంబంధం. రాంబాబు బంగారం. పిల్లోడి తండ్రి సంజీవి మంచి మనిషి. తల్లి శేషమ్మ గద్దరు మనిషి. దానికి ఎవరితోనూ పడదు. అందుకే ఊళ్ళోవాళ్ళు పిల్లని ఇవ్వడానికి భయపడుతున్నారు. రాంబాబుకి పెళ్ళీడు దాటిపోతోందని సంజీవి గోల. అందుకే ఈ ఏడాది కొడుకు పెళ్ళి చేసెయ్యాలని పట్టుదలగా ఉన్నాడు’’ చెప్పాడు నాగరాజు.నాగరాజు రాంబాబుకి మేనమామ వరస. ఊళ్ళోవాళ్ళు గయ్యాళి శేషమ్మతో తమపిల్లలు వేగలేదని డిసైడైపోయారు. అందుకే రాంబాబుకి పిల్లను ఇవ్వడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకురావడం లేదు. ఒకవైపు ఊళ్ళో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి.
సంజీవికి వెర్రెక్కిపోతోంది.‘నాగరాజూ! బైట ఊళ్ళల్లో మీ చుట్టాల్లో మంచి పిల్లని చూడరా! ఈ ఏడాది రాంబాబుకి పెళ్ళి చేసెయ్యాలి!’ అని పదే పదే చెబుతున్నాడు.అప్పుడు అతనికి పొన్నపల్లెలో ఉంటున్న బాబాయి కొడుకు రాజయ్య గుర్తుకు వచ్చాడు. అతనికి భార్య చనిపోతే రెండో పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఒక కూతురు ఉంది. సవతితల్లి కారణంగా సీత బాధలు పడుతోందని విన్నాడు. సవతితల్లుల చేతుల్లో కష్టాలు అనుభవించడం ఆడపిల్లలకు తరతరాలుగా ఉన్నదే. సవతితల్లితో వేగినపిల్ల గయ్యాళి అత్తతో సర్దుకుపోతుందని నాగరాజుకు నమ్మకం. అందుకే పెద్దరికం నెత్తిన వేసుకుని పొన్నపల్లెవెళ్ళి సీత పెళ్ళిగురించి రాజయ్యను కదిపాడు.‘‘నువ్వు మంచి సంబంధం తెచ్చావు. సంతోషం. నాకూ సీత పెళ్ళి చెయ్యాలనే ఉందన్నయ్యా! కానీ పంటలు సరిగ్గా లేవు. పెద్దోడు గుంటూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాడికి సర్దాలి. డబ్బుకి కటకటగా ఉంది. ఎరువులకొట్లో, మందులకొట్లో బాకీలున్నాయి. తన ఇబ్బందులు ఏకరువు పెట్టాడు రాజయ్య.