ఆ భార్యాభర్తలిద్దరూ చెరో విమానం ఎక్కడానికి కలిసి ఎయిర్పోర్టుకు వెళ్ళారు. భర్త బెంగళూరు విమానం ఎక్కాడు. కానీ భార్య వెనక్కుతిరిగి సిటీలోకొచ్చి హోటల్లో రూమ్ తీసుకుంది . తెల్లారేసరికి హత్యకు గురైంది . ఎవరో ఆమెను గొంతు నులిమి హతమార్చారు . డిటెక్టివ్ శరత్ కేసు టేకప్ చేశాడు. ఇంతకీ ఈ కేసులో హంతకుడెవరు ? శరత్ ఆ విషయం ఎలా కనిపెట్టాడు ?
‘ఏమిటీ వాసన’ గదిలోకి అడుగు పెడుతూనే అన్నాడు డిటెక్టివ్ శరత్’.‘నిజమే’ అన్నాడు ఇన్స్పెక్టర్ విజయ్. చాలా జాగ్రత్తగా గమనిస్తేగానీ వాసన గుర్తించలేం.హోటల్ మేనేజర్ శరత్ పక్కనే ఉన్నాడు. ‘ఇది రూమ్ఫ్రెష్నర్ వాసనా?’‘కాదండీ, మేం వాడే బ్రాండ్ వేరు’గదిని జాగ్రత్తగా గమనించాడు శరత్. వాసన శవంపైనుంచి వస్తోంది.శవాన్ని జాగ్రత్తగా పరిశీలించాక అర్థమైంది శరత్కి. అమ్మాయిపై అత్యాచారం చేసినవాడి ఒంటిమీది పరిమళం అమ్మాయికి అంటుకుంది! ఇంతలో అసిస్టెంట్ రాము గదిలోకొచ్చి ‘బాస్ హోటల్ గది రీతిక పేరుమీద అదే క్రెడిట్కార్డ్తో బుక్ అయింది. అడ్రస్ ఇదిగో’ ఇచ్చాడు రాము.‘గొంతు నులిమి చంపారని ప్రాథమిక దర్యాప్తు నివేదిక. అటాప్సీ రిపోర్టు వచ్చాకే ఏదైనా చెప్పగలం. అయితే ఈమె స్వచ్ఛంధంగానే లైంగికచర్యలో పాల్గొంది’ శరత్తో అన్నాడు డాక్టర్ ఫణి. హోటల్ రిజిష్టరులో వివరాలు చూశాడు శరత్.
అమ్మాయి ఉదయం పదిగంటలకు హోటల్ రూమ్ తీసుకుంది. భర్త తరువాత వస్తాడని చెప్పింది. పన్నెండుగంటల ప్రాంతంలో ఓ నడివయసు వ్యక్తి వచ్చి వివరాలడిగి ఆ రూమ్కెళ్ళాడు. అతను తిరిగెళ్ళడం ఎవరూ వెళ్ళటం గమనించలేదు. మర్నాడు రూమ్ క్లీనర్స్ తలుపుతీసి లోపలికెళితే శవం కనిపించింది.‘బహుశా ఉదయం అయిదు ఆరు మధ్యలో హత్య జరిగి ఉంటుంది’ చెప్పాడు ఫణి.‘బాస్...ఆ రూమ్కొచ్చిన వ్యక్తిని చూసినవాళ్ళిచ్చిన వివరాల ప్రకారం ఓ చిత్రపటం గీయించా’ అని శరత్కిచ్చాడు రాము.దాన్ని పక్కన పెట్టి, రూమ్ ఆర్డర్ల వివరాలు పరిశీలించసాగాడు శరత్.‘రాత్రి డిన్నర్ కూడా ఆర్డరిచ్చారు ఇద్దరికి. అంటే, అతడు రాత్రి కూడా ఉన్నాడు. అందరూ నిద్రిస్తుండగా తెల్లారే వెళ్ళిపోయుంటాడు’ గెస్ చేశాడు శరత్.