‘‘ఒక హత్యకేసులో ముగ్గురు అనుమానితులా?’’ అడిగాడు డిటెక్టివ్‌ శరత్‌.శరత్‌ ఎదురుగా కూరున్న ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ఇబ్బందిగా నవ్వాడు.‘‘ఈ కేసులో ఇదే సమస్య. ముగ్గురికీ మోటివ్‌ ఉంది. ముగ్గురినీ అనుమానించేందుకు ఆధారా లున్నాయి. ముగ్గురూ తాము నేరం చేయలేదంటున్నారు. అందుకే నీకు అప్పగించాలని నిశ్చయించాం. ప్రాథమిక పరిశీలనా నివేదిక ఇదిగో’’ అని శరత్‌కి అందించాడు విజయ్‌.

ఫైలు తెరిచాడు శరత్‌. ‘‘ఇది దీపిక హత్యకేసా! హై ప్రొఫైల్‌ కేసు’’ అన్నాడు.‘‘అందుకే ఈ తొందర. మా మీద చాలా ఒత్తిడి వస్తోంది’’ అన్నాడు.‘‘అఖ్తర్‌, క్రిష్టఫర్‌, దామోదర్‌ ముగ్గురూ అనుమానితులా’’ అన్నాడు శరత్‌.‘‘అఖ్తర్‌ పెద్ద సినిమా ప్రొడ్యూసర్‌. క్రిష్టఫర్‌ ప్రఖ్యాత నటుడు. దామోదర్‌ గొప్ప దర్శకుడు. ఈ ముగ్గురితో దీపికకు ప్రేమ సంబంధాలున్నాయి. గతంలో అఖ్తర్‌, క్రిష్టఫర్‌ బహిరంగంగా దీపిక కోసం కొట్టుకున్నారు.తనను కాదన్న దీపిక క్రిష్టఫర్‌ వైపు మొగ్గిందన్న కసితో దామోదర్‌ తాగి అర్థరాత్రి దీపిక ఇంటిముందుగోలచేశాడు. దీపిక పోలీసుకేసుపెట్టి, తరువాత ఉపసంహరించుకుంది.ఒకసారి ఈ నలుగురూ నలుగురూ ఓ సినిమా ప్రచారంకోసం హైదరాబాద్‌ వచ్చారు. క్రిష్టఫర్‌–దీపికలు ఒక హోటల్‌గదిలో ఉన్నారు.

ఆ గదికి చెరోవైపునా అఖ్తర్‌, దామోదర్‌ గదులున్నాయి.క్రిష్టఫర్‌–దీపికల గదిలోంచి తుపాకీ పేలిన శబ్దం విని అఖ్తర్‌, దామోదర్‌లు ఆ గదిలోకి పరుగెత్తుకెళ్ళారు. గదిలో మంచంమీద పడివున్న ఆమె గుండెభాగం నుంచి రక్తం కారుతోంది. అఖ్తర్‌ ఆమెకి ఫస్ట్‌ఎయిడ్‌ చేయాలని ప్రయత్నించాడు.దామోదర్‌ అంబులెన్సు్కూ, పోలీసులకూ ఫోను చేశాడు. ఈలోగా బాత్‌రూమ్‌లోంచి క్రిష్టఫర్‌ బయటకొచ్చాడు. వీళ్లనిచూసి ముందు ఆవేశపడ్డాడు. కానీ పరిస్థితిచూసి ఏడవటం ఆరంభించాడు. ఇంతలో అదే ఫ్లోర్‌లోంచి, ఇతర సినిమావాళ్లు వచ్చారు. వాళ్లలో సునీల్‌ అనే నటుడు షార్ప్‌గా ఆలోచించి పోలీసులు వచ్చేవరకు అందరినీ గది బయట ఉండమన్నాడు. గదిలో ఉన్న ముగ్గురినీ ఉన్నచోటు నుండి కదలవద్దన్నాడు. క్రైమ్‌సీన్‌ను ఎవరూ డిస్టర్బ్‌ చేయకుండా కాపాడాడు. ఇంతలో డాక్టర్లు, పోలీసులు వచ్చారు. అప్పటికే దీపిక మరణించింది.