బౌద్ధవృక్ష శాఖ...
విశాఖవిశాఖ తీరంలో బౌద్ధం ఓ బలమైన అలలా ఎగసి పడిన తీరు... మహాద్భుతఘట్టం, విషాదాంత అధ్యాయమూ! గుట్టల మీది ఆరామాల్లో గుట్టలుగా పడున్న కుండ పెంకులు, ఇటుకలు, నీటి తొట్టెలు... ఆ వైభవోపేతమైన గతానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ‘తథాగతుని అడుగుజాడలు’ ఆ వెలుగుచీకట్ల చరిత్రనంతా కళ్లకు కడుతుంది. పుస్తకాన్ని చదువుతుంటే ఓ వర్చువల్ టూర్కు వెళ్లిన భావన కలుగుతుంది. తమవైన శైలీవిన్యాసాలతో భూతభవిష్యత్ వర్తమానాల్లోకి షికార్లు చేయిస్తారు రచయితలు. ఏ తొట్లకొండ ఆరామం దగ్గరో మొదలుపెట్టి... అట్నుంచి తథాగతుని కాలంలోకి తీసుకెళ్లి... మళ్లీ వెనక్కి వచ్చి మానవ ప్రేరితమైన విధ్వంసాలు చారిత్రక ఆనవాళ్లను ధ్వంసం చేస్తున్న తీరును తలుచుకుని బాధపడిపోతారు. తమ వాదనలకు మద్దతుగా... ఏ కృష్ణశాస్ర్తినో, లార్స్ ఫోజెలిన్నో ఉటంకిస్తారు. సువ్యవస్థీకృతమైన నాటి బౌద్ధ సంఘాల గురించీ సోదాహరణంగా వివరిస్తారు. తెలుగుజాతి మీద బౌద్ధం ప్రభావాన్ని వివరించే పుస్తకమిది.
తథాగతుని అడుగుజాడలు
రచన: రాణీశర్మ, ఉణుదుర్తి సుధాకర్
పేజీలు: 194; వెల: రూ. 180
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
040 - 23521849