పెట్టుబడిదారీ వ్యవస్థ పతనాన్ని చాటే పుస్తకం
మానవజాతి ఆటవిక దశ దాటి సమాజ వ్యవస్థగా ఏర్పడిన తర్వాత ప్రజల సుఖశాంతులకోసం అనేక సిద్ధాంతాలను మేధావులు ప్రతిపాదించారు. కానీ పరిణామక్రమంలో మాత్రం రాచరిక వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకుంది. ఇది మునుపటికంటే అభివృద్ధికరమైన దశ ఐనప్పటికీ, ప్రపంచ ప్రజల సమస్యలకు మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థను అనుసరించే ప్రభుత్వాలు పరిష్కారం చూపించలేకపోయాయని స్పష్టంగా తేలిపోయింది. ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకాలు, అణచివేత, మానవహక్కుల నిరాకరణ, ప్రకృతి విధ్వంసం, ధనిక వర్గానికే కొమ్ముకాసే తీరుతెన్నులు, అంతకుమించిన ప్రపంచీకరణ విలయతాండవంవల్ల అసంతృప్తి తారాస్థాయికి చేరి ప్రత్నామ్నాయం కొరవడి ప్రజలు విలవిల్లాడుతున్నారు.
ఒకనాడు పెట్టుబడిదారీ వ్యవస్థ కుట్రలకు బలైన అత్యున్నతమైన సోషలిస్టు–కమ్యూనిస్టు సిద్ధాంత గొప్పతనం, ఆ వ్యవస్థలో ఉండే సమానత్వ జీవనవిధాన విశిష్టతలను ఈ నేపథ్యంలో ప్రజలకు తెలియజెప్పి విస్తారంగా ప్రచారం చెయ్యడానికి ఇదే తగిన సమయమని లెఫ్ట్ పార్టీలు కృతనిశ్చయానికి వచ్చాయి.
ఇకమీద ఫిబ్రవరి 21న ‘రెడ్ బుక్స్ డే’ పాటించాలని నిర్ణయించారు. కారల్ మార్క్స్, ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక సారాంశాన్ని ప్రతిమనిషికీ అర్థమయ్యేలా వివరించేందుకు మేధో ఉద్యమం ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఎ.గాంధీ తెనిగించిన ఈ పుస్తకం పెట్టుబడిదారీ వ్యవస్థ పతనాన్ని తెలియజెప్పి, దానికి ప్రత్యామ్నాయమార్గంవైపు మళ్ళించేందుకు దోహదం చేస్తుందీ పుస్తకం.
కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక కమ్యూనిజం సూత్రాలు
మార్క్స్ , ఏంల్స్
తెలుగు : ఎ.గాంధి
ధర : 20రూపాయలు, పేజీలు :96
ప్రతులకు : విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ, నవచేతన బుక్హౌస్లు